TS Inter Exams: అక్టోబర్ 25 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 70 శాతం సిలబస్ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.

Telangana Inter Exams Syllabus: తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 70 శాతం సిలబస్ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ప్రశ్నల్లో మరిన్ని మల్టీఫుల్ ఛాయిస్లు పెంచామన్నారు. నమూనా ప్రశ్నా పత్రాలు, పరీక్షల మెటీరియల్ను tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంచినట్లు జలీల్ తెలిపారు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. రెండో సంవత్సరంలో కాలేజీ మారిన విద్యార్థులు… మొదటి సంవత్సరం ఫీజు చెల్లించిన కాలేజీ జోన్ పరిధిలోనే పరీక్ష రాయాలని జలీల్ తెలిపారు.
అక్టోబర్ 25 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన ఫస్టియర్ విద్యార్థులకు (ప్రమోటై ప్రస్తుతం సెకండియర్లో ఉన్న విద్యార్థులు) పరీక్షలు నిర్వహించనున్నారు. 70 శాతం సిలబస్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్ష నిర్వహణలో పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామన్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఒకట్రెండు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏఎన్ఎం లేదా స్టాఫ్ నర్సు అందుబాటులో ఉండనున్నారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలన్నారు.
అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్, 26న ఇంగ్లీష్, 27న మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, 28న మ్యాథ్స్-1బీ, జువాలజీ, హిస్టరీ, 29న ఫిజిక్స్, ఎకనామిక్స్, 30న కెమిస్ట్రీ, కామర్స్, నవంబర్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 2న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్లకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.