Free Bus: మహిళలందరికీ గుడ్న్యూస్.. ఇకపై ఆ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం నుంచి మరో కీలక ప్రకటన వచ్చింది. రెండేళ్లు పూర్తయినందుకు ఆర్టీసీ సిబ్బందికిి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రేవంత్ సర్కార్ అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. దీంతో ఆర్టీసీలో ప్రయాణించే మహిళల సంఖ్య పెరగ్గా.. ఆర్టీసీకి కూడా దీని వల్ల లాభం జరుగుతోంది. ఈ పధకం ప్రారంభించి రెండేళ్లు ముగిసిన క్రమంలో ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇకపై అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ సౌకర్యం ఉందని, భవిష్యత్తుల్లో తీసుకురానున్న అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచిత బస్సు ప్రయాణం పొందుతున్నారు. అయితే త్వరలో ప్రభుత్వం ఇందులో మార్పులు చేయనుంది. మహిళలకు ఒక స్మార్ట్ కార్డును అందించనుంది. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆధార్ కార్డు విషయంలో బస్సుల్లో మహిళలు, ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు జరుగుతున్నాయి. దీనికి చెక్ పెట్టడంతో పాటు మరింత పారదర్శకత కోసం స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు. త్వరలోనే ఈ కార్డులను జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా ఈ స్మార్ట్ కార్డు ఉపయోగించి మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు.
రూ.8,459 కోట్ల ఖర్చు
ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోగా.. ప్రభుత్వం రూ.8,459 ఖర్చు చేసింది. 2023 డిసెంబర్ 9న ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం అందబాటులోకి వచ్చాక దేవాలయాల సందర్శన పెరిగిందని చెబుతున్నారు.
