Telangana BJP: బీజేపీ వ్యూహం.. ఆ నియోజకవర్గాలపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్..

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. 400లకు పైగా సీట్ల టార్గెట్ తో ముందుకువెళుతోంది. అయితే, దేశ వ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

Telangana BJP: బీజేపీ వ్యూహం.. ఆ నియోజకవర్గాలపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్..
Telangana BJP
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 17, 2024 | 5:21 PM

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. 400లకు పైగా సీట్ల టార్గెట్ తో ముందుకువెళుతోంది. అయితే, దేశ వ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలకు కాషాయ పార్టీ జెండా కప్పేందుకు, పెద్ద ఎత్తున చేరికలను మొదులుపెట్టేందుకు కమలనాథులు కసరత్తు మొదలు పెట్టారు. తెలంగాణలో కూడా ఆ పనిలో ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. రిజర్వుడు, వీక్ నియోజకవర్గాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ అధిష్టానం.. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది.

ఇప్పటికే.. 400 సీట్లకు పైగా పార్లమెంట్ సాధించాలని కిందిస్థాయి నేతలకు దిశానిర్దేశం చేసిన పార్టీ.. ఆ రకంగా ప్లాన్ చేస్తోంది. అయితే, పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆయా పార్లమెంట్ స్థానాల పరిధిలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమాన్ని చేపట్టిన పార్టీ ఈ నియోజకవర్గాల బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగించింది. వారు తమకు కేటాయించిన నియోజక వర్గాల్లో రెగ్యులర్ గా పర్యటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఇప్పటివరకు గెలువని, బలహీనంగా ఉన్న 160 నియోజక వర్గాలను గుర్తించింది. ఇందులో తెలంగాణవి కూడా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ తెలంగాణలో కూడా రిజర్వుడ్, వీక్ గా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నియోజక వర్గాల్లో పార్టీ నుంచి బలమైన అభ్యర్థి లేకుంటే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన వ్యక్తిని పార్టీలో కి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

జాతీయ స్థాయిలో ఈ నియోజకవర్గాల్లో జాయినింగ్స్ కోసం జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే నేతృత్వంలో ఓ కమిటీని కూడా పార్టీ వేసిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వరంగల్, పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ లాంటి నియోజకవర్గాల్లో బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం… ప్రస్తుత ఎంపీలను, మాజీ ఎంపీలను, ఆ నియోజకవర్గం మొత్తం మీద ప్రభావం చూపే వ్యక్తులపై కమలం పార్టీ కన్నేసిందనే ప్రచారం జరుగుతోంది. అయితే, తెలంగాణలో చేరికల కమిటీని ఆ పార్టీ రీవైజ్ చేసింది. ఇప్పటికే ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ టచ్ లో ఉన్నట్టు సమాచారం.. ఇలా చేరికలతోపాటు.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..