AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: దీపావళి తర్వాతే ప్రజల్లోకి.. కదనరంగంలోకి కాషాయదళం అగ్రనేతలు

తెలంగాణ ఎన్నిక సమరంలో పార్టీలు దూకుడు పెంచాయి. నామినేషన్ల ప్రక్రియ చివరి క్షణం వరకు అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేపట్టి నభారతీయ జనతా పార్టీ ప్రచారంలోనూ అదే తీరు కనబరుస్తోంది. ఎన్నికలు సమయం దగ్గరపడుతున్నా బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ప్రచారంలో అనుకున్నంత స్పీడ్ ను అందుకో లేకపోయింది.

Telangana Election: దీపావళి తర్వాతే ప్రజల్లోకి.. కదనరంగంలోకి కాషాయదళం అగ్రనేతలు
Bjp National Leaders
Ashok Bheemanapalli
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 12, 2023 | 12:30 PM

Share

తెలంగాణ ఎన్నిక సమరంలో పార్టీలు దూకుడు పెంచాయి. నామినేషన్ల ప్రక్రియ చివరి క్షణం వరకు అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేపట్టి నభారతీయ జనతా పార్టీ ప్రచారంలోనూ అదే తీరు కనబరుస్తోంది. ఎన్నికలు సమయం దగ్గరపడుతున్నా బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ప్రచారంలో అనుకున్నంత స్పీడ్ ను అందుకో లేకపోయింది. నవంబర్ 3వ తేదీ తర్వాత ప్రచారంలో దూసుకు వెళ్తామని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా ముఖం చెప్పారు. ప్రచారానికి ఇతర ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ వస్తారని వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు వారు ఎవరూ వచ్చింది లేదు. ప్రచారం చేపట్టింది లేదు. కేంద్ర మంత్రులు వచ్చినా వారు ప్రచారాన్ని అనుకున్నంత ఉధృతంగా తీసుకెళ్ల లేకపోయారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కమలం పార్టీ ప్రచారం హోరెత్తుతుందని తెలంగాణ బీజేపీ నేతలు కూడా భావించారు. కానీ చివరి క్షణం వరకు అభ్యర్థుల జాబితాలో మార్పులు చేయడంతో పాటు బీఫాం ఇవ్వడంలో జాప్యం చేయడంతో ప్రజల్లోకి ఎవరూ వెళ్లలేదు. బీఫాం అందాకే వెళ్దామని భావించి సైలెంటయ్యారు. పలు చోట్ల ప్రచారం చేపట్టినా అడపదడపా సాగింది. కానీ ఉధృతంగా మాత్రం జరగలేదు. నామినేషన్ల ప్రక్రియ ముగియగానే దీపావళి సెలవులు రావడంతో, బీజేపీ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవాలని భావిస్తోంది. కానీ పండుగ నాడు ఎంతమంది ప్రచారంలో పాల్గొంటారనేది కూడా అనుమానమే. అయితే కిషన్ రెడ్డి మరోసారి దీపావళి తర్వాత ప్రచారాన్ని మరింత ఉధృతంగా చేపడుతామని చెప్పడం గమనార్హం.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నవంబర్ 23వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలంతా తెలంగాణలోనూ మకాం వేయనున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 25, 26, 27 తేదీల్లో వస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రచారానికి చివరి వారం కీలకంగా మారనుంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ ముఖ్యమంత్రులు యోగి, హిమంత తెలంగాణ పర్యటన తేదీలు ఖరారు కాలేదు. దీపావళి తర్వాత అయా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతల తాకిడి రాష్ట్రానికి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి దీపావళి తర్వాత కమలం పార్టీ ప్రచారం జీహెచ్ఎంసీ ఎన్నికలకు మించి ఉంటుందా లేదా అన్నదీ వేచి చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…