Telangana: అక్కో ఇది విన్నారా.. చింత చిగురు రేటు మటన్ని దాటిపోయింది…
పట్టణాల్లో ఖరీదైన కూరగా మారింది చింత చిగురు. కిలో మటన్కు సమానంగా ధర పలుకుతుంది. దీంతో దీన్ని సామాన్యులు వంటల్లో భాగం చేసుకోవడం కష్టంగా మారింది. ఇక చింతచిగురులో ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉంటాయని న్యూట్రిషియన్లు వెల్లడిస్తున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

కూరగాయల రేట్లు ఎంత పెరిగినా.. సామాన్యులకు కాస్త అలకంగా దొరికేవి ఆకుకూరులు. తోటకూర, పాలకూర, మెంతికూర.. ఇలా ఏదైనా పదికి రెండు కట్టలు ఇస్తారు. మరీ అంతగా డిమాండ్ ఉంటే.. పదికి ఒక కట్ట లెక్కన ఇస్తారు. అంతకు మించి రేటు ఉండటం చాలా అరుదు. అయితే సమ్మర్లో మాత్రమే దొరికే చింత చిగురు ఇప్పుడు సామాన్యులకు చిక్కనంటుంది. ఏకంగా మటన్ రేటును దాటి పరుగులు తీస్తోంది. పల్లెల్లో అంత ధర లేనప్పటికీ.. పట్టణాలు, సిటీల్లో మాత్రం చింత చిగురు ధర మండిపోతుంది. ఖమ్మం నగరంలో ఆదివారం కేజీ చింత చిగురు రూ.వెయ్యి పలికింది. మాములు రోజుల్లో కిలో చింతచిగురు రూ.400 నుంచి రూ.500 మధ్య ఉంటుంది. అయితే ఆదివారం మాత్రం రికార్డు రేంజ్లో రూ.వెయ్యి పలకడం గమనార్హం. వామ్మో అదే వెయ్యి రూపాయలు పెడితే.. కేజీ మటన్ వస్తుందిగా అంటూ చాలా మంది వెనక్కి వెెళ్లిపోయారు.
చింత చెట్ల ఆకులు రాలిపోయాక, వచ్చిన ఇగురును తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వంటల్లో విరివిగా వాడతారు. చిగురును పప్పులో వేయడంతో పాటు.. మాంసం వంటకాల్లో కూడా వేస్తారు. చింత చెట్టు కొమ్మ చివరి వరకు ఎక్కి, ప్రాణాలకు తెగించి చిగురు సేకరిస్తామని విక్రయ దారులు చెబుతున్నారు. సరైన వర్షాలు లేక చిగురు చాలా తక్కువగా దొరుకుతుందని.. అందుకే దీనికి అంత ధర అని అంటున్నారు.
చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయని న్యూట్రిషీయన్లు చెబుతున్నారు. 100 గ్రాముల చిగురులో 10.6 గ్రాముల పీచు పదార్థం, 5.8 గ్రాముల ప్రొటీన్లు, 140 మి.గ్రా.ల ఫాస్పరస్, 100 మిల్లిగ్రాముల కాల్షియం, 26 మి.గ్రా.ల మెగ్నీషియం, విటమిన్–C 3 మి.గ్రా.లు ఉంటుందని అంటున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉండటం చేత.. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..