Telangana Congress: వలస నాయకులతో అసలు కాంగ్రెస్ లీడర్లు విలవిల.. టికెట్స్ ప్రకటన తర్వాత రచ్చ రచ్చే..!
Telangana Congress: పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తోంది. అందుకు అంది వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ అడుగులు ముందుకు వేస్తోంది. పార్టీ కోసం ఇంత కాలం శ్రమించిన నేతలను కాదని.. పారాచూట్ నేతలకు తిసుకువస్తుండడంతో టికెట్లు ఎవరికి రానున్నాయి..? అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. వచ్చినవారికే టికెట్లు దక్కితే.. ముందు నుండి ఉన్న పక్కా కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి..?

తెలంగాణ, అక్టోబర్ 04: పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తోంది. అందుకు అంది వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ అడుగులు ముందుకు వేస్తోంది. పార్టీ కోసం ఇంత కాలం శ్రమించిన నేతలను కాదని.. పారాచూట్ నేతలకు తిసుకువస్తుండడంతో టికెట్లు ఎవరికి రానున్నాయి..? అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. వచ్చినవారికే టికెట్లు దక్కితే.. ముందు నుండి ఉన్న పక్కా కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి..?
ప్రజలు కోరుకున్నట్లుగానే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేసిన తర్వాత కూడా పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ తాజా పరిస్థితులను చక్కగా వినియోగించుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే గెలవగలిగే అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే రాజకీయ, ఆర్థిక నేపథ్యం ఉన్న బడా నేతల వేటలో పడింది కాంగ్రెస్ పార్టీ. తన సర్వే టీమ్లతో 119 నియోజకవర్గాలలోని పేరున్న, బలమైన నేపథ్యం ఉన్న, గెలవగలిగే కెపాసిటీ ఉన్న నేతలను గుర్తిస్తోంది. అందులో బాగంగా పొరుగు పార్టీ నుంచి వస్తున్న నేతలకు టికెట్లు ఆఫర్ చేస్తుంది. టికెట్ల హమీతో పది మంది బీజేపీ మాజీ ఎంపీలకు కాంగ్రెస్ గాలం వేస్తుందని గాంధీ భవన్లో జోరుగా చర్చ కూడా జరుగుతోంది.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇన్నాళ్లు అనేక ఇబ్బందులకు, ఒడిదొడుకులకు ఎదురొడ్డి నిలబడి పార్టీ కోసం కష్టపడ్డ నేతలను పక్కన పెట్టేస్తున్నారన్న వాదన కూడా సీనియర్ నాయకుల్లో లేకపోలేదు. పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి కార్యక్రమాలు నిర్వహాస్తూ వస్తున్నామని, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వివిధ రూపాలలో ఇన్నాళ్లు కష్టపడ్డామని ఆ నేతలు వాపోతున్నారు. పారాచూట్ నేతల కోసం బలి చేస్తున్నారని కొందరు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఎవరితో అయితే ఇబ్బందులు పడ్డారో అదే నేతలు వచ్చి పార్టీలో చేరి టికెట్లను తన్నుకు పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పటిదాకా తమకి అండగా ఉన్న నేతలకి టికెట్ రాకపోతే రాష్ట్ర నాయకత్వం వద్ద తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు
ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములే మిన్న అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ తయారైందని.. స్వయంగా రాష్ట్ర, జాతీయ నేతలే ఈ విధంగా ప్రోత్సహించడం కాంగ్రెస్కి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకత ప్రజల్లోకి ఇప్పటికే వెళ్లినందున కాంగ్రెస్ సొంతంగా గెలవగలిగే అవకాశాలున్నా.. ఈ సందర్భంలో బీఆర్ఎస్, బిజెపి నేతలను డైరెక్ట్గా తీసుకొచ్చి టికెట్లు కేటాయించడం వెనుక మతలబెంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకా నిన్న మొన్నటిదాకా టికెట్ నీకే అని చెప్పి ఇప్పుడు మాత్రం టికెట్ ఇవ్వలేకపోతున్నాం.. సర్దుకు పోవాలని పార్టీ నేతలు రాయబారాలు నడపడాన్ని ఆశావాహులు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడ్డా పరాయి పార్టీ నుంచి వస్తున్న పారాచూట్ నేతలకే టికెట్లు ఇస్తారా అంటు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే తమ దారి తాము చూసుకుంటామని పలువురు నేతలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్లో టికెట్ల ప్రకటన గందరగోళానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలంటే మరి కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే..
