AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గృహలక్ష్మి లబ్ధిదారులకు తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం నిలిచిపోయిన గృహలక్ష్మి ఇళ్లను ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద పూర్తి చేయాలని నిర్ణయించింది. దశల వారీగా నిధులు విడుదల చేసి వేలాది కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడానికి చర్యలు చేపడుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేలాది లబ్ధిదారులకు ఇది ఊరటగా మారనుంది.

Telangana: గృహలక్ష్మి లబ్ధిదారులకు తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కార్..
Telangana Government
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Feb 21, 2026 | 9:34 PM

Share

గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయిన వేలాది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 2023లో సొంత స్థలం ఉన్న పేదలకు గృహనిర్మాణం కోసం రూ.3 లక్షల సాయం అందించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత నిధుల విడుదల నిలిచిపోవడంతో అనేక ఇళ్లు అర్థాంతరంగా మిగిలిపోయాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ పథకానికి లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక పరిశీలనల్లో దాదాపు 50 వేల మందిని అర్హులుగా గుర్తించారు. కొందరు లబ్ధిదారులు నిర్మాణం మొదలుపెట్టినా, ఎన్నికల కోడ్, ప్రభుత్వ మార్పు వంటి కారణాలతో పనులు ఆగిపోయాయి. దాంతో అర్థ నిర్మిత గృహాలు వర్షాలకు, ఎండలకు గురై దెబ్బతిన్నాయి.ప్రస్తుతం ప్రభుత్వం నిలిచిపోయిన గృహలక్ష్మి ఇళ్లను ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కిందకి తీసుకువచ్చి పూర్తి చేయాలని నిర్ణయించింది. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి నిర్మాణాన్ని పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం ఇంటి విస్తీర్ణం 400–600 చదరపు అడుగుల మధ్య ఉండాలి. అవసరమైతే పునాది విస్తరించాలి లేదా పరిమితం చేయాలి. ఇప్పటికే బేస్‌మెంట్ దశ పూర్తయిన వారికి ఆ దశ నిధులు ఇవ్వరు; మిగిలిన మొత్తాన్ని దశల వారీగా జమ చేస్తారు. పైకప్పు స్థాయి వరకు చేరితే రూ.1 లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.1 లక్ష ఇస్తారు. అదనంగా ఉపాధి హామీ కింద 90 రోజుల వేతనం, మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రత్యేక సాయం, అలాగే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద నిధులు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి. ఏళ్లుగా నిలిచిపోయిన పునాదులు ఇప్పుడు పూర్తి గృహాలుగా మారనున్నాయి. ఈ నిర్ణయం వల్ల గృహలక్ష్మి లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభించడమే కాకుండా, సొంతింటి కల సాకారం కావడానికి మార్గం సుగమం అవుతోంది.

Follow Us