AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్.. 24 వస్తువులతో మెగా ఎడ్యుకేషన్ గిఫ్ట్.. !

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూల్స్, గిరిజన విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లు అందించనుంది. ఒక్కో కిట్‌లో 24 అవసరమైన వస్తువులు ఉండగా.. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి చేకూరనుంది.

విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్.. 24 వస్తువులతో మెగా ఎడ్యుకేషన్ గిఫ్ట్.. !
Telangana Govt Schools
Prabhakar M
| Edited By: |

Updated on: Apr 04, 2026 | 8:12 AM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూల్స్, గిరిజన విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లు అందించనుంది. ఒక్కో కిట్‌లో 24 అవసరమైన వస్తువులు ఉండగా.. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి చేకూరనుంది.

ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లలో విద్యార్థుల దైనందిన అవసరాలన్నీ ఉంటాయి. స్కూల్ యూనిఫాం, వైట్ డ్రెస్, షూస్, సాక్సులు, బ్యాగ్, టై, బెల్ట్, ట్రాక్ సూట్, నైట్ డ్రెస్ వంటి దుస్తులతో పాటు.. బెడ్ షీట్, బ్లాంకెట్, టవల్ వంటి వసతి వస్తువులు కూడా అందిస్తారు. అలాగే ప్లేట్, గ్లాస్, కప్పు, స్పూన్, ట్రంక్ బాక్స్, స్టేషనరీ కిట్, నోట్‌బుక్స్ వంటి విద్యా అవసరాలన్నీ ఇందులో భాగం కానున్నాయి.

ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 24 వస్తువులను 9 కేటగిరీలుగా విభజించి ప్రత్యేక టెండర్లు పిలిచింది. ఎంపికైన గుత్తేదారులు 45 రోజుల్లోగా సరఫరా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలస్యమైతే జరిమానాలు విధించడంతో పాటు… నిబంధనలు ఉల్లంఘిస్తే బ్లాక్‌లిస్ట్ చేసే చర్యలు కూడా తీసుకోనుంది. ప్రతి వస్తువుకు బార్‌కోడ్ కేటాయించి పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రీ-బిడ్ సమావేశం కూడా నిర్వహించి టెండర్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే డే స్కాలర్ విద్యార్థులకు కూడా ఉపశమనం కలిగేలా నిర్ణయం తీసుకుంది. వారికి బ్లాక్ షూస్, రెండు జతల సాక్సులు, బెల్ట్ ఇవ్వనుంది. దీని ద్వారా మరో 19 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం చాలా మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చెప్పులు లేకుండా స్కూల్‌కు వెళ్తుండగా… ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటగా మారనుంది. 2026–27 విద్యా సంవత్సరానికి ముందే ఈ కిట్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల స్థాయి మరింత మెరుగుపడటంతో పాటు.. విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతుందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us