ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్! తెలంగాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో!
హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఉచిత MMTS ప్రయాణంపై ఆశలు తాత్కాలికంగా చల్లారాయి. MMTS రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. భారీ నష్టాలు, పెండింగ్ బకాయిలను కారణంగా చూపిన రైల్వే శాఖ, ఆర్థిక భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తేనే ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఉచిత MMTS ప్రయాణం కలగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. MMTS రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. ఇప్పటికే భారీ నష్టాల్లో నడుస్తున్న MMTS సేవలపై మరింత ఆర్థిక భారం మోపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో రైల్వే బోర్డు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. గత ఏడాది ఒక్కటే MMTS సేవల నిర్వహణలో దాదాపు రూ.160 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. మరోవైపు MMTS ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.490 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేసింది.
ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా MMTS రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది అమలు చేయడం వల్ల నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ పథకం వల్ల ఏర్పడే మొత్తం ఆర్థిక భారాన్ని భరిస్తామని అధికారిక హామీ ఇస్తే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అలాంటి హామీ లేకుండా ఈ పథకానికి ఆమోదం ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
MMTS సేవల కొనసాగింపు, ఆర్థిక స్థిరత్వం తమకు అత్యంత ప్రాధాన్యమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఆదాయంపై ప్రభావం చూపే నిర్ణయాలకు తగిన ఆర్థిక మద్దతు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో నగర ప్రయాణికులకు ఉచిత MMTS ప్రయాణంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం బకాయిల చెల్లింపు, భవిష్యత్తు ఆర్థిక భారం అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
