Nizamabad : సెలయేటి ఒడ్డున ఏం దొరికిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.. లక్ష సంవత్సరాల నాటి
పాతరాతి యుగం నాటి రాతి గొడ్డలిని పురావస్తు పరిశోధకులు మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో గుర్తించారు. డైనోసార్ల అవశేషాలు, బండబారిన చెట్ల శిలాజాలున్న ప్రాంతంలో ఈ రాతిగొడ్డలి లభించడం విశేషమన్నారు. ఈ చేతి గొడ్డలి లక్ష సంవత్సరాల కిందటి రాతి పరికరమని వారు చెబుతున్నారు.

తెలంగాణలోని నిజామాబాద్ను, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ను కలిపే జాతీయ రహదారి-63పై ఉన్న వడధామ్లో పురావస్తు ఔత్సాహికులు పురాతన శిలాయుగపు రాతి గొడ్డలిని కనుగొన్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ దొరికిన చేతి గొడ్డలి వయస్సు సుమారు 1,00,000 సంవత్సరాలు ఉండవచ్చని అన్నారు. పురాతన శిలాయుగం నాటి శిలాజాలు పుష్కలంగా ఉన్న వడధామ్ సమీపంలో కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు దీన్ని కనుగొన్నారు. వడధామ్ ప్రాంతం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ తాలూకా నుంచి దాదాపు 19 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రాంతం ప్రఖ్యాతి గాంచిన శిలాజ ఉద్యానవనానికి నిలయంగా ఉంది. రాక్షస బల్లులు, డైనోసార్ల అవశేషాలు, అవి నివశించిన వృక్ష శిలాజాలు ఆ ప్రాంతంలో చాలానే ఉన్నాయి. అక్కడి ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలలో.. ఈ తరహా ఆధారాలు సమృద్ధిగా కనిపిస్తాయట. ఈ ప్రాంతంలో పరిశోధకులు అన్వేషిస్తే.. మరిన్ని రాక్షస బల్లుల శిలాజాల జాడలు వెలుగుచూసే అవకాశం ఉందని చెబుతున్నారు.
బిలియన్ల సంవత్సరాల నాటిదిగా చెబుతున్న ఈ శిలాజ ఉద్యానవనం పక్కనే ఉన్న సెలయేటి నది ఒడ్డున కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నజీర్… ప్రారంభ నవీన శిలాయుగం నాటిదని నమ్ముతున్న రాతి గొడ్డలిని కనుగొన్నారు. అమూల్యమైన.. పురాతన సంపదను గుర్తించి వాటిని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పురావస్తు సర్వేల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకోవాలని హరగోపాల్ పేర్కొన్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
