Hyderabad: ” అందుకే నన్ను గబ్బర్ సింగ్ అంటారు.. కోడి పందేలు నాకో సరదా”
రాజేంద్రనగర్లోని ఓ ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మొత్తం 64 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 53 మంది ఏపీ వాళ్లు అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాగా ఈ కోడి పందాలు నిర్వహించిన శివవర్మ... అది ఓ సరదా అని చెప్పారు. కేసినో నిర్వహించినట్లు వచ్చిన వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు.

కొద్దిరోజుల క్రితం మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన కోడిపందాల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిర్వాహకుడు భూపతి రాజు శివకుమార్ వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే భూపతి రాజు శివకుమార్ వర్మ గతంలోనూ కోడిపందాలు నిర్వహించినట్లు టీవీ9తో చెప్పారు. అమలాపురంకి చెందిన శివకుమార్ వర్మ ప్రతి సంక్రాంతికి కోడిపందాలు నిర్వహించటం తమకు ఆనవాయితీగా వస్తుందని చెబుతున్నాడు. అయితే సంక్రాంతి ముగిసిన తర్వాత మిగిలిపోయిన కోళ్లతో తన బర్త్ డే సందర్భంగా హైదరాబాదులో కోడిపందాలు నిర్వహిస్తూ ఉండేవాడినని తెలిపాడు. ప్రతి సంవత్సరం జనవరి 29న బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో కోడిపందాలు నిర్వహిస్తుంటానని తెలిపాడు.
అయితే కొద్ది రోజుల క్రితం కోడి పందేల గురించి సమాచారం అందడంతో పోలీసులు రైడ్ నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మేం కోడి పందేలు వేశాం నిజమే.. కేసినో వంటివి ఏం ఆడలేదని శివకుమార్ వర్మ చెబుతున్నాడు. అయితే ఆ ఫామ్ హౌస్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిది కావడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అయితే తనకు ఇప్పటివరకు ఫామ్ హౌస్ ఓనర్ ఎవరో తెలియదని భూపతి రాజు తెలిపాడు. ఇకమీదట తెలంగాణలో ఎలాంటి కోడిపందాలు నిర్వహించను అని భూపతిరాజు స్పష్టం చేశాడు. ఏపీలో సంక్రాంతికి మాత్రం మరింత ఘనంగా నిర్వహిస్తానని తెలిపాడు. మరో వైపు తనకు గబ్బర్ అని బిరుదు ఎందుకు వచ్చిందో కూడా టీవీ9తో పంచుకున్నాడు. తనకి 30 సంవత్సరాల క్రితమే తన తల్లిదండ్రులు షోలే సినిమా చూసి తనను గబ్బర్ సింగ్ అని పిలవడం ప్రారంభించారని భూపతి రాజు తెలిపాడు. అప్పటినుండి తనకు దగ్గరివారు, సన్నిహితులు అందరూ కూడా గబ్బర్ సింగ్ అనే పిలుస్తారని భూపతి రాజు శివ వర్మ తెలిపాడు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్హౌస్లో కోడిపందాల నిర్వహణపై పోలీసులకు వివరణ ఇచ్చారు MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఈ నెల 13న పోచంపల్లికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో తన అడ్వకేట్ ద్వారా నోటీసులకు సమాధానమిచ్చారు. కోడిపందాలు జరిగిన ఫామ్హౌస్ తనదే, వర్రా రమేష్ రెడ్డి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాను, అతని నుంచి మరొకరు లీజుకు తీసుకున్నారు, వారి నుంచి భూపతిరాజు లీజుకు తీసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన వివరణ ఇచ్చారు శ్రీనివాస్రెడ్డి. ఫామ్హౌజ్లో కోడి పందాల నిర్వహణపై పోచంపల్లి మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.
తోల్కట్ట పరిధిలో ఉన్న ఫామ్హౌస్లో కోడిపందాలు నిర్వహిస్తున్నారని తెలిసి ఈ నెల 12న పోలీసులు దాడులు చేశారు. 64 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ పోలీసులతో కలిసి రాజేంద్రనగర్ SOT టీమ్ జాయింట్ ఆపరేషన్లో ఈ కోడిపందాల వ్యవహారం బయటపడింది. స్పాట్లో ఉన్న వాళ్ల నుంచి 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 మొబైల్స్ సీజ్ చేశారు. 84 కోళ్లను కూడా పట్టుకుని స్టేషన్కు తరలించారు.
ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. ఈ వివాదం నేపథ్యంలో వెంటనే స్పందించిన పోచంపల్లి తన ఫామ్హౌస్ను లీజుకు ఇచ్చానని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫామ్హౌస్ను భూపతిరాజు అనే వ్యక్తి చేతిలో ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
