స్థానిక సమరం.. తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో భాగంగా 32 జిల్లాల్లో 197 జడ్పీటీసీ, 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ జారీతో నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 6వ తేదీన పోలింగ్ జరగనుంది. 25న నామినేషన్ల పరిశీలన, అదే రోజున బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. 26న అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27న […]
హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో భాగంగా 32 జిల్లాల్లో 197 జడ్పీటీసీ, 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ జారీతో నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 6వ తేదీన పోలింగ్ జరగనుంది. 25న నామినేషన్ల పరిశీలన, అదే రోజున బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. 26న అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27న అభ్యంతరాలను పరిశీలించి 28న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అదేరోజు బరిలో నిలిచినవారికి ఎన్నికల గుర్తులు ఖరారు చేస్తారు.
పార్టీల తరుపున బీ-ఫాంలు సమర్పించినవారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు. ఆ తర్వాతి క్రమంలో స్వతంత్రులకు గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చు. మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులకు అప్పీల్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థులైతే కలెక్టర్కు, ఎంపీటీసీ అభ్యర్థులైతే ఆర్డీవోలు, సబ్కలెక్టర్కు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. తొలి విడతలో సోమవారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలుకానుండగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తొలి విడతలోనే ఎన్నికలు పూర్తికానున్నాయి.