Business Idea: వేలల్లో పెట్టుబడి పెడితే.. లక్షల్లో లాభాలు పక్కా..! బిజినెస్ ఐడియా మీకోసం
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతాల్లో కొరమీన చేపల పెంపకం రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారుతోంది. గ్రామాల చెరువులు, కుంటలకే పరిమితమైన చేపల పెంపకం ఇప్పుడు రైతుల సొంత పొలాలకే చేరింది. తక్కువ స్థలంలోనే పెంచవచ్చని, మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో కొరమీన పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది.

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొరమీను చేపల పెంపకం రైతులను మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. హైదరాబాద్కి దగ్గర్లో ఉండడంతో ఇక్కడ ఈ చేపల పెంపకం పెద్ద ఎత్తున్న సాగుతుంది. ఒకప్పుడు చేపల పెంపకం అంటే గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల్లో ఎక్కువగా పెంచేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. చాలా మంది రైతులు ఇప్పుడు వారి వారి సొంత పొలంలోనే కొంత స్థలంలో ఇలా కొరమీను చేపలను పెంచుతున్నారు. అతి తక్కువ స్థలంలోనే ఇవి పెరుగుతుండటంతో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. పోషక విలువలు కలిగి ఉండి, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కొరమీను చేపలను కొద్దిపాటి స్థలంలోనే పెంచవచ్చు. వ్యవసాయానికి అనుబంధంగా రైతులు వీటి పెంపకాన్ని చేపట్టి.. మంచిగా అర్జిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని ఓ రైతు కొర్రమీను చేపల పెంపకంతో అధిక లాభాలు అర్జించవచ్చని నిరూపించాడు. కంది మండలానికి చెందిన ఆంజనేయులు రెండున్నర ఎకరాల పొలంలో కొర్రమీను చేపట్టాడు. లాభసాటిగా ఉండటంతో గత నాలుగు సంవత్సరాలుగా చేపల ఉత్పత్తి చేస్తున్నాడు. 6 నెలలకు ఒకసారి క్రాప్ వస్తుందని. ఏపీ నుంచి నాలుగు ఇంచులు, ఐదు ఇంచులు ఉన్న కొర్రమీను చేప పిల్లల్ని తీసుకొచ్చి… రెండున్నర ఎకరాల పొలంలో గుంటలు కట్టి వాటిలో ఈ చేపలను ఉత్పత్తి చేస్తున్నామని తెలిపాడు. దీనివల్ల లాభాలు బాగానే ఉన్నాయంటున్నాడు.. ఇలా హైదరాబాద్కి దగ్గర్లో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, పటాన్చెరు, జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుతున్నారు. వీటి పెంపకానికి కావాల్సిందల్లా తొట్టెను పెట్టేందుకు చిన్న షెడ్డు, కొలను. వీటి ఏర్పాటుకు ప్రభుత్వాలు కూడా మంచి ప్రోత్సాహకాలు ఇస్తుంది.
ఔత్సాహికులకు బ్యాంకు లోన్లు ఇప్పించడంతో పాటు యూనిట్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొరమీనులో మాత్రం ఫీడ్ సక్రమంగా అందిస్తే తప్పనిసరి లాభాలు సొంతం చేసుకోవచ్చు అని అంటున్నారు అనుభవం ఉన్న రైతులు. స్థానికంగా మార్కెట్ లేకున్నా హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి.. మంచి బరువున్న చేపలకు అధిక ధర లభిస్తుందని అంటున్నారు రైతులు. మోర్టాలిటీ శాతాన్ని తగ్గించుకుంటే కొర్రమీను చేపల పెంపకంలో రైతు సత్ఫలితాలను సాధించవచ్చ అని అంటున్నారు కొరమీను పెంపకందారులు.
