Kodad: ఫోర్బ్స్ మ్యాగజైన్పై కోదాడ కుర్రోడు..
కలలు కనండి.. సాకారం చేసుకోండి.. అన్న స్వర్గీయ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలను నిజం చేశాడు ఓ యువకుడు. కృషి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రముఖ బిజినెస్ మేగజిన్ కవర్ పేజీపై చోటు సంపాదించాడు. అలాంటి ప్రతిష్టాత్మకమైన మేగజిన్ ఏది..?. అందులో చోటు సంపాదించిన యువకుడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన యాకుబ్ పాషా, ముంతాజ్ బేగం దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వ టీచరుగా పని చేస్తున్న యాకూబ్ పాషా చదువు ద్వారానే భవిషత్తు ఉంటుందని భావించాడు. ఉన్నంతలో తన పిల్లలిద్దరినీ చదివించాడు. జానీ పాష 10వ తరగతి వరకు కోదాడలోనే చదువుకున్నారు. విజయవాడలో ఇంటర్ చదివిన జానీ పాషా ఖరగ్ పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. ఏదైనా స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయాలని భావించాడు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫోర్బ్స్ మేగజిన్లో తన పేరును చూసుకోవాలని జానీ పాషా భావించేవాడు. ఇందుకు తన స్నేహితుడైన విపుల్ చౌదరితో కలిసి 2018లో ‘లోకల్’ పేరుతో యాప్ను రూపొందించాడు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సత్వరంగా అందించేలా ఈ యాప్ను తయారు చేశాడు. తెలుగు, కన్నడ భాషలలో రూపొందించిన లోకల్ యాప్ను జానీ పాషా కోదాడలోనే లాంచ్ చేశాడు. ఏడేళ్లలోనే ఈ యాప్ రూ.238 కోట్ల పెట్టుబడులను సేకరించి దూసుకెళ్లింది. దీంతో ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ కంపెనీగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ మ్యాగజైన్.. ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 100 స్టార్టప్ కంపెనీలను గుర్తించి వ్యాసం ప్రచురించింది. ఇందులో జానీ పాష స్థాపించిన ‘లోకల్ యాప్’ చేరింది. దీంతో ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ అక్టోబర్ నెలలో “100 టు వాచ్’ పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అక్టోబర్ నెల సంచిక కవర్ పేజీపై జానీ పాష ఫొటోను ప్రముఖంగా ప్రచురించింది. స్టార్టప్ కంపెనీల ఫౌండర్లు.. ఎదుర్కొన్న సమస్యలు, అధిగమించిన తీరు, సక్సెస్కు సంబంధించిన సమగ్ర విషయాలు, ఇంటర్యూలతో ప్రత్యేక కథనంలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రముఖ బిజినెస్ పేపర్ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియాలో చోటు సంపాదించుకోవడంపై జానీ పాషా ఆనందం వ్యక్తం చేశాడు. అబ్దుల్ కలాం చెప్పిన బోధనల ఆధారంగా తాను లోకల్ యాప్ అనే స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశానని చెబుతున్నాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జానీపాష అరుదైన ఈ గౌరవాన్ని పొందడం పట్ల జానీ పాషా స్నేహితులు, కోదాడవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
