Kishan Reddy : ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
రామగుండం NTPC సెకండ్ ఫేజ్లో భాగంగా ఏర్పాటు చేయనున్న 2400MW థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చడానికి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు NTPC సిద్ధంగా ఉందని.. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. పూర్తి సామర్థ్యానికి బొగ్గు సేకరణలో NTPCకి స్వేచ్ఛ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రామగుండం NTPC ధర్మల్ పవర్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ లో భాగంగా 2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి NTPC చర్యలు చేపట్టిందని.. మొదటి ఫేజ్లో లాగే రెండవ ఫేజ్లో ఉత్పత్తి చేసే విద్యుత్లో 85% విద్యుత్ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందని పేర్కొన్నారు. 3 మార్చి, 2026 న తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందని. రానున్న రోజులలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరగనుందని పేర్కొన్నారు.
దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందని.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల విద్యుత్ రంగం మీద ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో “జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో 5000 నుంచి 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని తెలియజేశారన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారని దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసిందన్నారు.
అతి తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంలో NTPC కి దేశంలోనే విశేషమైన అనుభవం ఉందని.. పూర్తి 4000 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో NTPCకి తగిన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే, థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి NTPC సిద్ధంగా ఉందన్నారు.
తద్వారా, ప్రభుత్వానికి, ప్రజలకు ఇద్దరికీ లబ్ధి చేకూరనుందని తెలిపారు. అధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో తక్కువ ధరకే విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుండటంతో ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా NTPC నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి, అవసరమైన ఒప్పందాలు(PPAs) చేసుకుంటాయని విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఎంతో అనుభవం ఉన్న NTPC, సెకండ్ ఫేజ్ లో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న 2400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(PPA) చేసుకునేలా కృషి చేయాలని కోరారు. అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మేలు చేకూర్చే రామగుండం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రం మంత్రి రాసుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
