Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్‌లో విమానయాన సేవలకు గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్ తర్వాత వరంగల్, ఆదిలాబాద్‌లలో విమాన సేవలు ప్రారంభమైతే, తెలంగాణ మరిన్ని ఉడాన్ మార్గాల నుండి ప్రయోజనం పొందుతుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ప్రయాణీకుల సౌకర్యాన్ని మాత్రమే కాకుండా ఈ ప్రాంతాలలో వర్తక వాణిజ్య అభివృద్ధిని పెంచుతుంది. ఇది మధ్యతరగతి వారికి తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు.

తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్‌లో విమానయాన సేవలకు గ్రీన్ సిగ్నల్!
Kishan Reddy
Follow us
Balaraju Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 05, 2025 | 7:17 PM

వరంగల్‌లోని మామ్నూర్‌లో విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత, తెలంగాణలోని మరో నిజాం కాలం నాటి ఎయిర్‌స్ట్రిప్ విమానాశ్రయంగా మారడానికి మరో ముందడుగు పడింది. ఆదిలాబాద్‌లో సివిల్ విమానాశ్రయం ఏర్పాటుకు భారత వైమానిక దళం (IAF) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. మామ్నూర్‌తో పాటు ఇది వాస్తవ రూపం దాల్చితే రాష్ట్రానికి ఇది మూడోవ ఎయిర్ పోర్టు కాబోతుందని కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పౌర విమానయాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడులకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి పౌర సేవలు కొనసాగాయి. ఇటీవలె మమ్నూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. నిజాం కాలంలో, 1724 నుండి 1948 వరకు అసఫ్ జాహి రాజవంశం హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని పాలించిన కాలంలో, మమ్నూర్, ఆదిలాబాద్ ఎయిర్‌స్ట్రిప్‌లు పనిచేశాయి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్..

ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) కింద, సుమారు 620 మార్గాలలో, దాదాపు 60 మార్గాలు ప్రస్తుతం హైదరాబాద్‌కు పనిచేస్తున్నాయి. కొత్త విమానాశ్రయాలు మరిన్ని ఉడాన్ మార్గాలను అందించనున్నాయి. మధ్యతరగతి ఖర్చుతో కూడుకున్న రీతిలో విమాన ప్రయాణాన్ని పొందేందుకు వీలు కల్పిస్తోంది కేంద్రం. ఈ క్రమంలోనే ఆదిలాబాద్‌లోని వైమానిక దళ శిక్షణా కేంద్రం ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి ద్వారా స్థానిక సమాజానికి అవకాశాలను కూడా అందిస్తుందని భావిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని వైమానిక దళ ఎయిర్‌స్ట్రిప్ పౌర విమానయాన సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలియజేయడంతో ఆదిలాబాద్ ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారమయ్యే దశకు చేరుకుంది.

ఆదిలాబాద్‌లో శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని మొదట భావించినట్లు IAF నుండి అధికారిక సమాచారం కాపీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంచుకున్నారు. “అయితే, IAF అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్ నుండి పౌర విమాన కార్యకలాపాల కోసం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈమేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏప్రిల్ 4న రాసిన లేఖలో పేర్కొన్నారు. పౌర విమానయానం, వైమానిక దళ విమానాల కదలికలకు అనువైన ఉమ్మడి వినియోగదారు ఎయిర్‌ఫీల్డ్‌గా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని లేఖ సూచించిందని మంత్రి చెప్పారు.

పౌర విమానాలకు అనుగుణంగా రన్‌వేను పునర్నిర్మించడం, సివిల్ టెర్మినల్ ఏర్పాటు చేయడం, విమాన ఆప్రాన్ వంటి అదనపు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటివి ముఖ్యమైన పనులలో ఉన్నాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అవసరమైన భూమిని AAIకి అందించాలని వైమానిక దళ అధికారులు అభ్యర్థించారని కూడా ఆయన అన్నారు. స్థానిక పౌరులు, నాయకుల అభ్యర్థనలకు ప్రతిస్పందనగా, గతంలో చాలాసార్లు రక్షణ మంత్రిని కలిశామని, జనవరి 29, 2025న ఒక లేఖ కూడా రాశానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌లోని అందుబాటులో ఉన్న వైమానిక దళ భూమిని వైమానిక దళ స్టేషన్‌గా ఏదైనా ఇతర ఉత్పాదక ప్రజా మౌలిక సదుపాయాల కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆయనను కోరారు. ప్రజల ఆకాంక్షలు, అనేక అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, ఈ చొరవను సానుకూల ముగింపుకు తీసుకెళ్లడానికి లేఖలు రాయడం ద్వారా కేంద్ర రక్షణ మంత్రి, పౌర విమానయాన మంత్రి ఇద్దరినీ వ్యక్తిగతంగా కలవడం ద్వారా ఈ ప్రయత్నాలు ఫలించాయని కిషన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ తర్వాత వరంగల్, ఆదిలాబాద్‌లలో విమాన సేవలు ప్రారంభమైతే, తెలంగాణ మరిన్ని ఉడాన్ మార్గాల నుండి ప్రయోజనం పొందుతుందన్నారు కిషన్ రెడ్డి. ఇది ప్రయాణీకుల సౌకర్యాన్ని మాత్రమే కాకుండా ఈ ప్రాంతాలలో వర్తక వాణిజ్య అభివృద్ధిని పెంచుతుంది. ఇది మధ్యతరగతి వారికి తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. గతంలో ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఉండేది, కానీ దానిని సైనిక ప్రయోజనాల కోసమే ఉపయోగించేవారు. కాలక్రమేణా, వివిధ కారణాల వల్ల రక్షణ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ ఎయిర్‌స్ట్రిప్‌ను ఇప్పుడు పునరుద్ధరించడం వల్ల రక్షణ, పౌర విమానయాన ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..