TGSPDCL Interviews: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పోస్టులకు ఇంటర్వ్యూలు.. రాత పరీక్ష లేకుండానే నేరుగా జాబ్ కొట్టే ఛాన్స్
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కీలకమైన డైరెక్టర్ల నియామక ప్రక్రియలో ఎట్టకేలకు చర్యలు మొదలైనాయి. విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎన్పిడీసీఎల్/టీజీఎస్పీడీసీఎల్)ల్లో, జెన్కో, ట్రాన్స్కోలో డైరెక్టర్ పోస్టుల నియామకానికి ఇంటర్వ్యూలు ఈ నెలలో చేపడుతున్నాయి..

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్వ్యూకు హాజరవ్వాలని దరఖాస్తుదారులను కోరుతూ తాజాగా ప్రకటన జారీ చేసింది. నిజానికి, ఈ పోస్టుల భర్తీకి 2024 జనవరి చివరిలోనే ఉద్యోగ ప్రకటనలు జారీచేసినా.. ఇప్పటి వరకూ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో పాత డైరెక్టర్లను 2024 ఫిబ్రవరిలోనే తొలగించి కిందిస్థాయి వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చి అప్పటి నుంచి నెట్టుకొస్తున్నారు. ట్రాన్స్కో, జెన్కోలో డైరెక్టర్లుగా రిటైర్డ్ ఇంజినీర్లు ఇప్పటి వరకు కొనసాగుతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. వీరిని 2025 మార్చి 31 నాటికి తొలగించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వేసవి సీజన్ నడుస్తున్నందువల్ల విద్యుత్ డిమాండు నేపథ్యంలో కొత్తవారిని నియమించేదాకా వారినే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో కొత్త డైరెక్టర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం ఐదు డైరెక్టర్ పోస్టులకు 152 దరఖాస్తులు వచ్చాయి. రైల్వేశాఖ, ఎన్టీపీసీ, సింగరేణితో పాటు దేశవ్యాప్తంగా పలు విద్యుత్ కంపెనీలకు చెందిన సీనియర్, రిటైర్డ్ ఇంజినీర్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ సంస్థల్లో చీఫ్ ఇంజినీరు (సీఈ)గా పనిచేస్తున్నవారు కూడా పెద్దసంఖ్యలో ఈ పోస్టులకు పోటీపడుతున్నారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఏప్రిల్ 9న ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పిడీసీఎల్/టీజీఎస్పీడీసీఎల్)ల్లో, ఏప్రిల్ 10న తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), ట్రాన్స్కోలో డైరెక్టర్ల నియామకానికి ఇంటర్వ్యూలు జరపనున్నారు.
ముగుస్తోన్న ఏపీఆర్జేసీ సెట్-2025 దరఖాస్తు గడువు..
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఆర్జేసీ సెట్-2025) దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఏపీఆర్ఈఐ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2025-26 విద్యా సంత్సరానికి ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి 2025 మార్చి 31తో ఆన్లైన్ దరఖాస్తుల గడువు పూర్తవగా ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు 2025 ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.