వలస పక్షుల స్వర్గధామం కవ్వాల్… ఇప్పుడు భయపెడుతున్న గుడ్లగూబలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కవ్వాల్ అభయారణ్యం, సమీప ప్రాంతాల్లో పక్షుల గణన జరిగింది. కౌటాల అటవీ ప్రాంతంలో అరుదైన చంద్రముఖ గుడ్లగూబ గాయాలతో కంటపడగా, అటవీ శాఖ రక్షించి చికిత్స అందించింది. కవ్వాల్ టైగర్ జోన్తో పాటు ఇతర జలవనరుల్లో స్థానిక, ఆర్కిటిక్ వలస పక్షులతో సహా వందలాది జాతులను గుర్తించారు. వలస పక్షుల సంఖ్య పెరుగుతుండటంతో అటవీ శాఖ వాటి రక్షణకు చర్యలు చేపట్టి, స్థానికుల సహకారం కోరుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కవ్వాల్ అభయారణ్యంతో పాటు సమీప ప్రాంతాల్లో పక్షుల గణన కొనసాగింది. ఈ గణనలో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని కౌటాల అటవీ ప్రాంతంలో పలు రకాల అరుదైన పక్షులను గుర్తించారు అటవిశాఖ అదికారులు. అందులో వింతగా కనిపించింది గుడ్లగూబ జాతికి చెందిన ఓ పక్షి. మునుపెన్నడు చూడని విచిత్ర ఆకారంతో ఉండటంతో స్పెషల్ జాబితాలో చేర్చింది అటవిశాఖ.
కౌటాల అటవీ ప్రాంతం వైపు వెళ్లిన ఓ వ్యక్తికి ఈ అరుదైన గుడ్లగూబ కంటపడింది. అది గాయపడి ఉన్నట్లు గమనించి, ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో అటవీ అధికారులు అక్కడికి చేరుకొని ఆ గుడ్లగూబను పశువైద్య శాలకు తీసుకువెళ్లి వైద్యం చేయించారు. పక్షిని కాపాడి తమకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని అభినందించారు. ఈ అరుదైన గుడ్లగూబను బార్న్ ఓల్ అని పిలుస్తారని.. దీనిని తెలుగులో చంద్రముఖ గుడ్లగూబ అని పిలుస్తారని ఎఫ్.ఆర్.ఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
అటు కవ్వాల్ టైగర్ జోన్లో ను పక్షుల కిలకిల రావాలు ఆకట్టు కుంటున్నాయి. స్థానిక పక్షులతో పాటు మైగ్రేడ్ పక్షులను అధికారులు గుర్తించారు. టైగర్ జోన్ వ్యాప్తంగా ఇటికాస్ సంస్థ చేసిన సర్వేలో 264 పక్షులను గుర్తించగా, అందులో జన్నారం అటవీ డివిజన్లోని కిష్టాపూర్ చెరువులోనే 80 రకాల పక్షులను గుర్తించినట్లు వన్యప్రాణుల పరిశోధకుడు, ఇటికాస్ ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ ఎనగందుల వెంకట్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ చెరువులోను ఆసియా వాటర్ బర్డ్ సెన్సెస్ వారితో కలిసి పక్షుల గణన చేపట్టారు. ఈ సందర్భంగా దేశీయ, విదేశీయ పక్షులు కలిపి సుమారు 109 రకాల పక్షులను నమోదు చేశారు. వీటిలో 39 జాతుల పక్షులు ఆర్కిటిక్ ఖండం నుండి వలస వచ్చిన పక్షులు ఉన్నట్లు గుర్తించారు.
వలస పక్షులు టైగర్ జోన్ పరిధిలో, జన్నారం అటవీ డివిజన్ పరిధిలో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంపై అటవీశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యం లో వలస పక్షుల సంఖ్య పెరుగుతుండటంతో వాటి రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది అటవిశాఖ. సమీప చెరువుల వద్ద నిఘా పెంచింది. వలస పక్షులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉందంటూ స్థానికుల సాయం కోరుతోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




