Rain Alert: రానున్న 24 గంటల్లో వానలే వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
AP and Telangana Weather Report on October 8: ఒడిస్సా దక్షిణ చత్తీస్గడ్ మీదుగా తూర్పు తెలంగాణ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటకలో మీదుగా కోస్టల్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం..

హైదరాబాద్, అక్టోబర్ 8: అంతర్గత ఒడిస్సా దక్షిణ చత్తీస్గడ్ మీదుగా తూర్పు తెలంగాణ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటకలో మీదుగా కోస్టల్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ ఎత్తులో మరొక ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఈ రోజు (అక్టోబర్ 8) తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రేపు తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ , హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు తెలంగాణలోని 23 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఏపీలో నేటి వాతావరణం ఇలా..
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా కోనసీమ జిల్లా ఐ.పోలవరంలో 9.12 సెంటీమీటర్ల వాన కురిసింది. ఇక అనకాపల్లిలో 7.05 సెంటీమీటర్లు, చీపురుపల్లిలో 6.67 సెంటీమీటర్లు, కోటనందూరులో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓ వైపు వానలు పడుతుంటే ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండ భగభగలాడిపోతుంది. నిన్న దేశంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 37.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




