
హైదరాబాద్, డిసెంబర్ 30: రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్య అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్,వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది.
చలి తీవ్రత దృష్ట్యా పార్కులలో ప్రజలు స్వెటర్లు, మంకీ క్యాప్ లతో వాకింగ్ చేస్తున్నారు. రోజువారి పనుల కోసం ఉదయం బయటికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులతో పోల్చుకుంటే చలి తీవ్రత ఈరోజు మరింత పెరిగింది. దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్న పిల్లలు, వృద్దులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.