Telangana High Court on Ganesh immersion: వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో హైదరాబాద్లో విగ్రహాల నిమజ్జనంపై జీహెచ్ఎంసీ అధికారులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే.. గణేష్ నిమజ్జనంపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను ధర్మాసనం రిజర్వ్ చేసింది. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అంటూ జీహెచ్ఎంసీపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక కూడా లేదా.. అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ సందర్భంగా జనం గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని హైకోర్టు పేర్కొంది.
కాగా జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లోనూ వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలియజేసింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని.. లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే సలహాలు కాదని.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. త్వరలోనే నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది.
Also Read: