Telangana: లంచం కొట్టు.. పర్మిషన్ పట్టు.. 2025లో ఏ శాఖలో ఎక్కువ అవినీతి జరిగిందో తెలుసా?
Record Corruption Crackdown in 2025: తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అవినీతిపై ఉక్కుపాదం మోపుతుంది ఏసీబీ. అయితే ఏసీబీ దాడుల్లో ఈ ఏడాది సరికొత్త రికార్డులు నమోదు అయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కరప్షన్ కేసులు భారీగా పెరిగాయి. ఆ లెక్కలేంటో చూద్దాం పదండి.

రాష్ట్రంలో పెరుగుతన్న అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాదిలో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 220కు పైగా కేసులను నమోదు చేసింది ఏసీబీ. ఈ కేసుల్లో 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడం విశేషం. ముఖ్యంగా అధిక శాతం కేసులు ట్రాప్ కేసులే కావడం గమనార్హం. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన అధికారుల సంఖ్య ఈ ఏడాది మరింత పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏసీబీ నమోదు చేసిన కేసుల సంఖ్య దాదాపు 100 వరకు పెరిగింది. గత సంవత్సరం మొత్తం 152 కేసులు నమోదు కాగా, వాటిలో 223 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఏడాది కేసుల సంఖ్య మాత్రమే కాకుండా, దాడుల తీవ్రత కూడా పెరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇరిగేషన్ అధికారుల రికార్డ్
ఈ ఏడాది అవినీతిలో ఇరిగేషన్ శాఖ అధికారులు రికార్డు కొట్టారు. ఈ ఏడాది దాడుల్లో ఏసీబీకి పట్టుబడిన అధికారుల్లో ఎక్కువగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులే ఉన్నారు. కీలక శాఖల్లో పనిచేస్తున్న అధికారులు లంచాలకు అలవాటు పడటంపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఏసీబీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
ఇదిలా ఉండగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల నమోదులో కూడా ఈ ఏడాది పెరుగుదల కనిపించింది. అవినీతితో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 17 మంది అవినీతి అధికారుల భరతం పట్టినట్టు ఏసీబీ వెల్లడించింది. మొత్తంగా చూస్తే, తెలంగాణలో అవినీతిపై ఏసీబీ చేపడుతున్న చర్యలు మరింత కఠినంగా మారాయి. భవిష్యత్తులో కూడా అవినీతిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఏసీబీ ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
