Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌ జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని తెలిపారు.

Hyderabad: ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Revanth Reddy
Follow us
Anand T

|

Updated on: May 18, 2025 | 10:07 PM

ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఓల్డ్‌సిటీలో అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు అధికారులు. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు, ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని చెబుతున్నారు. ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ లేని ఓల్డ్‌ బిల్డింగ్ కావడంతో లోపలున్న వాళ్లెవరూ తప్పించుకోలేకపోయారని అంటున్నారు. కాగా.. హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని తెలిపారు.

సంచలన విషయాలు వెల్లడి..

గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. భవనం పైనుంచి కిందుకు రావాలన్నా… కింది నుంచి పైకి వెళ్లాలన్నా ఒకటే దారి.. అదీ కూడా చాలా ఇరుకైన మార్గం కావడం కూడా ప్రమాద స్థాయిని పెంచింది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది చిన్న మెట్ల గుండా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేసింది. అయితే, అవి.. టన్నెల్ లాంటి మెట్లు కావడంతో ఫైర్ సిబ్బందికి కూడా తక్షణ సాయం చేయడానికి కొంత అవరోధం కలగడం కూడా ఇంతమంది మరణాలకు కారణమైంది. షట్టర్‌, గోడ బద్దులుకొట్టాకే లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది.

టెర్రస్ కింద మెట్ల పక్కనే ఒక్కసారిగా మంటలు భారీగా వ్యాపించడంతో… బాధితులంతా టెర్రస్ మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే టెర్రస్ పైన ఉన్న మెట్లకు కూడా తాళం వేయడంతో ప్రమాదం నుంచి ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకపోయింది.

బిల్డింగ్‌ బయటికి G+1… లోపల మాత్రం G+2గా నిర్మించినట్లు తెలిపారు అధికారులు. g+2కి ఎలాంటి పర్మిషన్‌ లేదని చెబుతున్నారు. అలా అక్రమ నిర్మాణం కూడా ప్రమాదానికి మరో కారణంగా చూస్తున్నారు. అగ్నిప్రమాద ఘటనను రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిజంగానే ప్రమాదమా…? లేక కుట్రకోణం ఏమైనా దాగుందా…? అనే అంశాలపైన కూడా కూపీ లాగుతున్నారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..