TSRTC: రాత్రి బస్సులకు విశేష ఆదరణ.. మరిన్ని మార్గాల్లో నడిపేందుకు అధికారుల నిర్ణయం
వివిధ ప్రాంతాల నుంచి రాత్రి సమయాల్లో హైదరాబాద్(Hyderabad) చేరుకునే వారి కోసం ఆర్టీసీ రాత్రి వేళల్లోనూ బస్సులు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బస్సులకు ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రయాణీకుల నుంచి....
వివిధ ప్రాంతాల నుంచి రాత్రి సమయాల్లో హైదరాబాద్(Hyderabad) చేరుకునే వారి కోసం ఆర్టీసీ రాత్రి వేళల్లోనూ బస్సులు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బస్సులకు ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రయాణీకుల నుంచి ఆదరణ వస్తోంది. రాత్రి 10 గంటలు దాటితే ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులు గమనించిన ఆర్టీసీ అధికారులు రాత్రి వేళ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. సికింద్రాబాద్(Secunderabad) నుంచి కొన్ని మార్గాల్లో బస్సులను నడుపుతోంది. ఈ బస్సులకు 75 శాతం ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారులు మరిన్ని మార్గాల్లో బస్సులు నడిపించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రీజియన్లలో రాత్రిపూట మొత్తం 20 బస్సులను నడుపుతున్నారు. ముఖ్యమైన మార్గాల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకూ ఈ బస్సులు సేవలు అందిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పటాన్చెరు, అఫ్జల్గంజ్, బోరబండ, మెహిదీపట్నం వరకు ప్రస్తుతం బస్సులు నడుస్తున్నాయి.
రాత్రి బస్సులకు వస్తున్న ఆదరణలతో కొత్తగా సికింద్రాబాద్ – పంజాగుట్ట, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్ మార్గంలో నడిచే 47Lను కూడా రాత్రి పూట అందుబాటులో ఉంచడానికి, సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ నడిచే 10H సర్వీసులు కూడా రాత్రి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయాణికుల రద్దీని పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ రీజియన్ 56 సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. పటాన్చెరు నుంచి కోఠి, సీబీఎస్కు 222 నంబరు బస్సు రెండు ట్రిప్పులు నడుస్తున్నాయి. కోఠి, దిల్సుఖ్నగర్ నుంచి బంజారాహిల్స్ మీదుగా ఇదే నంబరు బస్సులను నడపాలని నిర్ణయించారు. లింగంపల్లి, బేగంపేట, కాచిగూడ, హైదరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి పూట బస్సులుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి