ఫ్రెండ్షిప్ డే, ఆగస్టు 15 ఆఫర్ల పేరుతో నిండా ముంచారు.. హైదరాబాద్లో రూ.25 కోట్ల భారీ స్కామ్..
హైదరాబాద్ ఇబ్రహీంపట్నం కేంద్రంగా QVSE పేరుతో నిర్వహించిన ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ యాప్పై భారీ మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డాలర్ల రూపంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి వేలాది మందిని ఆకర్షించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే, ఆగస్టు 15 ఆఫర్లతో సభ్యులను చేర్చిన ఈ స్కామ్లో సుమారు రూ.25 కోట్ల వరకు మోసం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ‘QVSE’ పేరుతో నిర్వహించిన ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ద్వారా భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డాలర్ల రూపంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దండుమైలారం, రాయపోల్, పోల్కంపల్లి, నాగన్పల్లి గ్రామాలకు చెందిన వేలాది మంది ఈ మోసానికి బలైనట్లు సమాచారం. దండుమైలారంలోనే సుమారు 800 మంది, రాయపోల్లో 400 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అధిక రాబడుల ఆశతో కొందరు బంగారం తాకట్టు పెట్టగా, మరికొందరు అప్పులు చేసి మరీ యాప్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు బాధితులు చెబుతున్నారు.
ఫ్రెండ్షిప్ డే, ఆగస్టు 15 ఆఫర్ల పేరుతో కొత్తగా సభ్యులను చేర్చిన వారికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఎర వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. యాప్లో డాలర్ల రూపంలో లాభాలు పెరుగుతున్నట్లు చూపించిన నిర్వాహకులు.. చివరకు డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం లేకుండా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారని కూడా చెబుతున్నారు.
రాయపోల్కు చెందిన అమరేందర్ రెడ్డి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ స్కామ్లో సుమారు రూ.25 కోట్ల వరకు మోసం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గుర్తుతెలియని ఇన్వెస్ట్మెంట్ యాప్లను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వారు వెంటనే 1930 లేదా 112 టోల్ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి సూచించారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
