Hyderabad: బిగ్ అప్డేట్.. లాటరీలో పేరు వచ్చిందా? ఇంటికి అధికారులు వస్తున్నారు.. ఇందిరమ్మ ఇళ్ల తుది జాబితా లెక్కింపు స్టార్ట్!
Indiramma Housing Scheme: ఖైరతాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపికపై ఎక్కువ సంఖ్యలో ఆరోపణలు రావడంతో అధికారులు మరింత లోతుగా వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డ్రా ప్రక్రియపై స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నట్లు..

Indiramma Housing Scheme: హైదరాబాద్ పరిధిలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంలో మరో కీలక దశ మొదలైంది. ఇళ్ల కేటాయింపునకు ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎంపికైన కుటుంబాల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. ఇందిరమ్మ టవర్స్లో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు డ్రా నిర్వహించారు. లాటరీ ద్వారా ఎంపికైన వారి వివరాలను తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. నియోజకవర్గాల వారీగా దరఖాస్తు నంబర్, లబ్ధిదారుడి పేరు, ప్రస్తుత నివాస చిరునామా వంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఎంపికైన వ్యక్తి అర్హతపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే విధంగా ప్రత్యేక ఆప్షన్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
లాటరీ ప్రక్రియ పూర్తవడంతో.. నేటి నుంచి ఎంపికైన లబ్ధిదారులపై తుది స్థాయి వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతోంది. మొత్తం 16 నియోజకవర్గాల్లో అధికారులు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను పరిశీలించనున్నారు. ప్రధానంగా.. ఇందిరమ్మ ఇంటికి ఎంపికైన కుటుంబం సంబంధిత నియోజకవర్గంలో గత పదేళ్లుగా నివసిస్తోందా లేదా అనే అంశాన్ని అధికారులు నిర్ధారించనున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తున్న 480 ఇళ్లకు సంబంధించి 600 మందికి పైగా అధికారులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక్కో నియోజకవర్గానికి 20 మంది చొప్పున ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఒక్కో బృందం రోజుకు కనీసం 150 కుటుంబాల వివరాలను తనిఖీ చేయనుంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
లబ్ధిదారుల ఇంటి వద్ద ఏం పరిశీలిస్తారు?
- క్షేత్రస్థాయి తనిఖీల్లో అధికారులు పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
- ఎంపికైన లబ్ధిదారుడు సంబంధిత నియోజకవర్గంలోనే ప్రస్తుతం నివసిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేస్తారు.
- లబ్ధిదారుడి ప్రస్తుత నివాసాన్ని జియోట్యాగ్ చేస్తారు.
- దరఖాస్తులో నమోదు చేసిన వివరాలు వాస్తవాలతో సరిపోతున్నాయా లేదా పరిశీలిస్తారు.
- కుటుంబ సభ్యుల వివరాలను కూడా అధికారులు ధృవీకరిస్తారు.
- కుటుంబం గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలో నివసిస్తున్నదా అనే అంశంపై విచారణ చేస్తారు.
- క్షేత్రస్థాయిలో సేకరించిన మొత్తం సమాచారాన్ని అక్కడి నుంచే ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు.
ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా.. అదే సంఖ్యలో లబ్ధిదారులను ప్రధాన జాబితాలో ఎంపిక చేశారు. అయితే తుది పరిశీలనలో ఎవరైనా అనర్హులుగా తేలితే వారి స్థానంలో అర్హులకు అవకాశం కల్పించేందుకు వెయిటింగ్ లిస్ట్ను కూడా సిద్ధం చేశారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గం నుంచి 120 మందిని అదనపు జాబితాలో ఉంచాలని నిర్ణయించారు. అయితే డ్రా ప్రక్రియ జరిగిన తొలి రోజే కొన్ని నియోజకవర్గాల్లో ఎంపికపై ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న దరఖాస్తుదారుల సంఖ్య 300 దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపికపై ఎక్కువ సంఖ్యలో ఆరోపణలు రావడంతో అధికారులు మరింత లోతుగా వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డ్రా ప్రక్రియపై స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఖైరతాబాద్ మినహా మిగిలిన 15 నియోజకవర్గాలకు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ను ఇప్పటికే విడుదల చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రారంభమైన క్షేత్రస్థాయి తనిఖీల్లో అర్హతలు, నివాస వివరాలు, దరఖాస్తులో పేర్కొన్న సమాచారం ఆధారంగా తుది జాబితాను ఖరారు చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




