AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్ల తర్వాత తొలిసారి అత్యంత చల్లగా నవంబర్.. వచ్చే 2 రోజులు మరింత గజగజ!

రాష్ట్రంలో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి నవంబర్‌లో గరిష్ఠ చలి తీవ్రత కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే భారీగా తగ్గిపోయాయి. ముఖ్యంగా కోమురంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఈసారి రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదు అయ్యింది..

8 ఏళ్ల తర్వాత తొలిసారి అత్యంత చల్లగా నవంబర్.. వచ్చే 2 రోజులు మరింత గజగజ!
Cold Wave Conditions Likely In Telangana
Lakshmi Praneetha Perugu
| Edited By: Srilakshmi C|

Updated on: Nov 20, 2025 | 12:35 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి నవంబర్‌లో గరిష్ఠ చలి తీవ్రత కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే భారీగా తగ్గిపోయాయి. ముఖ్యంగా కోమురంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఈసారి రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదు అయ్యింది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7°C నుంచి 9°C మధ్య నమోదవడంతో నవంబర్‌లో అరుదుగా కనిపించే చలి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఉత్తర తెలంగాణ జిల్లాలైన రాజన్న సిరిసిల్లా 9°C, కమారెడ్డి 9.3°C, నిజామాబాద్ 9.4°C, సంగారెడ్డి 9.5°C, సిద్ధిపేట 9.6°C, నిర్మల్ 9.7°C వద్ద కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వాతావరణ తీవ్రతను స్పష్టంగా చూపించాయి. ఇప్పటికే రాష్ట్రం అంతటా చలి తన ప్రభావాన్ని మరింతగా విస్తరించడంతో ప్రజలు బోనం మంటల వద్ద గుమిగూడి తాపాన్ని పొందుతున్నారు.

హైదరాబాద్ కూడా ఈసారి చలికి అతీతం కాలేదు. నగర పరిసర ప్రాంతమైన సిరిలింగంపల్లి 10.8°C ఉష్ణోగ్రతను నమోదు చేసి ఈ సీజన్‌లో అత్యల్ప స్థాయికి చేరింది. రాజేంద్రనగర్ 12.2°C, బోలారమ్ 12.3°C, సికింద్రాబాద్ కాంటోన్మెంట్ 12.8°C వద్ద కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగరంలోని మిగతా ప్రాంతాలు కూడా గణనీయమైన చలిని అనుభవించాయి. గాచిబౌలి, జీడిమెట్‌లలో ఉష్ణోగ్రత 13.3°Cకు పడిపోయింది. ముషీరాబాద్, బహదూర్‌పురా, కార్వాన్‌లో 14.1°C, జూబ్లీహిల్స్, మాధాపూర్ పరిసరాలు మాత్రం కొంత తక్కువ చలిగా 14.5°C–15°C మధ్య ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే 48 గంటల్లో కూడా ఈ చలి కొనసాగే అవకాశం ఉంది. ఈసారి నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2018 నవంబర్‌కాలం శీతలతకు సరితూగుతున్నాయని IMD అధికారులు చెబుతున్నారు. వచ్చే రెండు రోజులు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3°C–4°C తక్కువగా ఉండే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు వచ్చాయి. అసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సాంగారెడ్డి, మెదక్, కమారెడ్డి జిల్లాల్లో మరింత చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణశాఖ అంచనా. ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.