Charminar MLA Mumtaz Ahmed Khan: హైదరాబాద్ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారా? ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతానన్న అభిప్రాయం వ్యక్తంచేయడం MIM సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యే.. రాజకీయాలను వీడి.. కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ఖాన్ షాకింగ్ నిర్ణయంతో అనుచరులు ఆందోళన చెందుతుండగా.. ఆశావహులు మాత్రం ఆనందంలో మునిగిపోయారు. మూడు దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని పాలించిన అహ్మద్ఖాన్కు ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన నిర్ణయాన్ని ఎంతమాత్రం ఆమోదించని అనుచరులు.. రాజకీయాల్లో కొనసాగాలని ఒత్తిడి తెస్తున్నారు. మరో వాదనను సైతం తెరమీదకు తెస్తున్నారు. చార్మినార్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా MIM, BJP మధ్య పోరు కొనసాగడమే వారి ఆవేదనకు కారణం. ప్రతి ఎన్నికలోనూ ఈ రెండు పార్టీల మధ్య గెలుపు నెక్ టూ నెక్ ఉంటూ వస్తోంది. బీజేపీని తట్టుకుంటూ ప్రజల్లో ఆదరణ సంపాదించిన అహ్మద్ఖాన్.. నిర్ణయం నియోజకవర్గ భవితవ్యంపై ప్రభావం చూపుడం ఖాయమంటున్నారు అనుచరులు. అహ్మద్ఖాన్ నిర్ణయం బీజేపీ నెత్తిన పాలుపోయడమే అంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం సైతం లేకపోలేదంటున్నారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ముంతాజ్ ఖాన్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. ఆయనతో ఫోన్లో మాట్లాడిన కొందరు కార్యకర్తలకు ఎమ్మెల్యే చెప్పిన సమాధానం విస్తుపోయేలా చేసింది. అందుకు ఓ కార్యకర్తతో ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో.. వైరల్ కావడం బలం చేకూరుస్తోంది. బంధువులు, మిత్రులతో సైతం అదేనిర్ణయాన్ని చెబుతుండడంతో రాజకీయాల నుంచి తప్పుకోవడం ఖాయమంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఎమ్మెల్యే అధికారికంగా ప్రకటిస్తే తప్ప.. ఈ గందరగోళానికి తెరపడేలా లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..