JP Nadda: హైదరాబాద్ చేరుకోనున్న జేపీ నడ్డా.. ఎయిర్పోర్ట్ వద్ద ఘన స్వాగతం.. ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ..
BJP National Executive Meet: జేపీ నడ్డాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా హెచ్ఐసీసీకి చేరుకుంటున్నారు జేపీ నడ్డా.
బీజేపీ (BJP)జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయనతో పాటు మరో 300 మందికి పైగా బీజేపీ ప్రతినిధులు తెలంగాణాకు చేరుకుంటారు. జేపీ నడ్డాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, రాజ్యసభ సభ్యులు జాతీయ ఓ.బి.సి నేత, ఎంపీ లక్ష్మణ్, విజయశాంతి, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, స్వామి గౌడ్, వివేక్ వెంకటస్వామి, ధర్మపురి అరవింద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా హెచ్ఐసీసీకి చేరుకుంటున్నారు జేపీ నడ్డా. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాట్లు చేసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇవాళ గోల్కొండ ప్రాంగణంలోని ఎగ్జిబిషన్ను ప్రారంభించనున్నారు జేపీ నడ్డా.
బీజేపీ నేషనల్ మీట్ కోసం HICC పరిసరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. స్వాగత ద్వారాన్ని కాకతీయ కళాతోరణంలా అందంగా తీర్చిదిద్దారు. గుస్సాడి నృత్యాలతో ప్రాంగణం మొత్తం సందడి వాతావరణం నెలకొంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ HICC వద్ద హల్చల్ చేశారు. బీజేపీ మహిళా కార్యకర్తలతో కలిసి నృత్యం చేసి… క్యాడర్లో జోష్ నింపారు సునీల్.
శనివారం హైదరాబాద్ చేరుకుంటారు ప్రధాని మోదీ. మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. రేపు, ఎల్లుండి హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
బీజేపీ మీటింగ్స్ జరిగే ప్రాంగణాలకు తెలంగాణ ప్రాంతాలు, వ్యక్తుల పేర్లు పెట్టారు. HICC- నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరమని, సభాస్థలికి కాకతీయ ప్రాంగణమని, భోజనశాలకు భాగ్యరెడ్డివర్మ ప్రాంగణమని, మీడియా హాల్కు షోయబుల్లాఖాన్ హాల్ అని నామకరణం చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరు పెట్టారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్కి నాలుగు అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఇప్పటికే బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయింది హైదరాబాద్. అటు సాంస్కృతిక కార్యక్రమాలతో HICC కలర్ఫుల్గా మారంది.
SPGతోపాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్తో నిఘా పెట్టారు. మోదీ వెళ్లే ప్రాంతాల్లో స్నిప్పర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలు, మఫ్టీ పార్టీలు నిఘా పెట్టాయి.
లా అండ్ ఆర్డర్పై సిటీ పోలీసులతో SPG అధికారుల సమీక్ష జరిగింది. నోవాటెల్, HICC చుట్టూ మెట్రో బంద్ ఉంటుంది. డ్రోన్లపై ఆంక్షలు పెట్టారు. పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నుంచే ఫ్లైఓర్ను క్లోజ్ చేస్తారు. చుట్టుపక్కల భవనాలు శనివారం నుంచే SPG కంట్రోల్లోకి వెళతాయి.
పరేడ్ గ్రౌండ్స్లో జరిగే సంకల్ప సభకు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎటెండవుతారన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. వేదికను ఆ మేరకు భారీగా నిర్మించబోతున్నామన్నారు.