ఆరెస్సెస్ కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి.. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం ఇదిగో..
Bandi Sanjay Kumar Telangana Election 2023: బండి సంజయ్.. ఓ సామాన్యుడిగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి ఎదిగిన ఈయన.. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకోవడమే కాకుండా.. ఏకంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులవ్వడం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఈయనకు పదవి దక్కిన సమయంలో తెలంగాణ బీజేపీ పార్టీలో..

Bandi Sanjay Kumar Telangana Election 2023: తాను నమ్మిన సిద్దాంతాలనే ఆచరణలో పెట్టారు.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. వెనకడుగు వెయ్యలేదు. స్వయం సేవకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి కమలదళానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. ఎంతోమంది సీనియర్ నాయకులు ఈ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నప్పటికీ.. అందరినీ వెనక్కి నెట్టి ఆ పీఠాన్ని అధిరోహించారు ఈ నాయకుడు. తాను అధ్యక్షుడిగా ఉన్న పదవికాలంలో పార్టీని రేసులో నిలపడమే కాదు.. తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇంతకీ ఆయన మరెవరో కాదు బీజేపీ సీనియర్ లీడర్ బండి సంజయ్. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.
రాజకీయ ప్రస్థానం ఇలా..
బండి సంజయ్ది రాజకీయ కుటుంబం కాకపోయినప్పటికీ.. ఆయన చిన్ననాటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాల వైపే ఎక్కువ ఆకర్షితుడయ్యాడు. హిందుత్వాన్నే ఎజెండాగా నమ్ముకున్న బండి సంజయ్.. బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్లో సేవకుడిగా పని చేశాడు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడు ఏబీవీపీలో చేరి కరీంనగర్ పట్టణ కన్వీనర్గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1996లో ఎల్కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథయాత్రలో.. వెంకయ్యనాయుడు సిఫార్సు మేరకు వాహన ఇన్చార్జి బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి.. అద్వానీ దృష్టిని ఆకర్షించారు బండి సంజయ్. ఇదే ఆయన రాజకీయ జీవితానికి తొలి అంకం అయింది. నాయకత్వపు లక్షణాలను ఆర్ఎస్ఎస్ నుంచి పుణికి పుచ్చుకున్నానని చెప్పే బండి సంజయ్ను ఆ తర్వాత ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో సహాయక్గా పంపించారు అద్వానీ. సెంట్రల్ ఆఫీస్లో ఉంటూ అద్వాని, వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ రాజకీయ నాయకుల నుంచి లోతైన విషయాలు నేర్చుకున్నారు బండి సంజయ్. మొదటి నుంచి హిందూ ధర్మాన్ని అనుసరించే బండి సంజయ్.. చిన్నప్పటి నుంచి నుదిటిపై బొట్టును పెట్టుకునేవారు.. ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా ఆ అలవాటును ఆయన మార్చుకోలేదు. 2014, 18లో రెండుసార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందారు.
ఆ తర్వాత 2020 మార్చి 11 నుంచి 2023 జూలై 4 వరకు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా సేవలు అందించిన బండి సంజయ్.. జూలై 4, 2023న ఆ పదవి నుంచి వైదొలిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు.. హుజురాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చడంలో బండి సంజయ్ చూపిన రాజకీయ చతురత విస్మరించలేనిది. ఆయన స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ హైకమాండ్. ఇకజూలై 30, 2023న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ను ప్రకటించింది ఆ పార్టీ హైకమాండ్. కాగా, ఈ పదవిని 4 ఆగష్టు 2023న ఆయన చేపట్టారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో బీజేపీ తరపున కరీంనగర్ నియోజకవర్గం నుంచి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
ఎగ్జిట్ పోల్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయని జోస్యం చెప్పారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ, దుబ్బాక ఉపఎన్నికలోనూ బీజేపీ గెలవదని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పాయని.. కానీ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఎంతటి విజయం సాధించిందో గుర్తు చేశారు.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..