
హైదరాబాద్ నగరంలో మరోసారి పాడైన పదార్థాలతో ఆహారం తయారీ కలకలం రేపింది. నిత్యం ప్రజలు తినే ఆహారం తయారీలో వ్యాపారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ ఘటన మళ్లీ స్పష్టంచేసింది. జియాగూడలో అక్రమంగా నడుస్తున్న ఒక ఆహార తయారీ కేంద్రంపై టాస్క్ఫోర్స్కు చెందిన హెచ్-ఫాస్ట్ బృందం, కుల్సుంపురా పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా భారీ ఎత్తున సమోసాలు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అంతేకాదు వారికి ఎలాంటి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా లేదని.. అత్యంత అస్వచ్ఛ ప్రదేశంలో, పాడైన పదార్థాలతో సమోసాల తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పాడైన ఉడికించిన గుడ్లు, పలుమార్లు వాడిన నూనె వినియోగించి సమోసాలు తయారు చేస్తున్నట్టు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో 500 పాడైన గుడ్లు, ఐదు కిలోల మళ్లీ వాడిన నూనె, 350 గుడ్డు సమోసాలు, 600 స్వీట్కార్న్ సమోసాలు, 1000 ఉల్లిపాయ సమోసాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అబ్దుల్ రషీద్ (73) అనే వ్యక్తి ఈ ఆహార తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా తయారీకి ఉపయోగిస్తున్న ముడి సరుకును కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కుల్సుంపురా పోలీసులు వెల్లడించారు. ఆహార కల్తీ, అక్రమ తయారీ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి ఘటనలను గమనిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. బయట కనిపించే ఆహారం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, దాని వెనుక ఉన్న వాస్తవాలు తెలుసుకోవడం తప్పని సరి అవుతుంది. కాబట్టి జనాలు సాధ్యమైనంత వరకు ఇంట్లో వండుకొని తినడం ఉత్తమమని నిపులణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.