10th Class Exams 2026: ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్లతో రావొద్దు.. విద్యాశాఖ ఆదేశాలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు ప్రారంభమైన రెండో రోజు అంటే మార్చి 18న పరీక్ష ప్రారంభమైన కాసేపటికే హిందీ క్వశ్చన్ పేపర్ వాట్సప్లో లీక్ అయిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు ప్రారంభమైన రెండో రోజు అంటే మార్చి 18న పరీక్ష ప్రారంభమైన కాసేపటికే హిందీ క్వశ్చన్ పేపర్ వాట్సప్లో లీక్ అయిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ సంఘన చోటు చేసుకోవడంతో విధుల్లో ఉన్న 9 మంది సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విధుల్లో పాల్గొనే ఇన్విజిలేటర్లు సహా ఇతర సిబ్బంది ఏ ఒక్కరూ పరీక్షాకేంద్రాలకు మొబైల్ ఫోన్లతో రావొద్దని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా అవసరమైతే బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ నుంచి ఫోన్ తీసుకుని మాట్లాడాలి అనే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విధుల్లో పాల్గొనే సిబ్బందికి తనిఖీలు లేకపోవడం అలుసుగా తీసుకుని కొందరు వాటిని లోపలికి తీసుకెళ్తున్నారు. దీంతో ఇకపై పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లను ట్రాకింగ్ చేసే విధానం తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
దీంతో పరీక్షా కేంద్రాల్లోకి ఎవరైనా ఫోన్ తీసుకొచ్చి స్విచ్ ఆఫ్ చేసినా గుర్తిస్తామని, పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు నిషేధమని విద్యాశాఖ స్పష్టం చేసింది. తాజా ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో క్లర్క్లు, రిజర్వ్లో ఉన్న ఇన్విజిలేటర్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రమే కూర్చొని ఉండాలి. విద్యార్థుల వద్దకు, కారిడార్లలో తిరగరాదని విద్యాశాఖ పేర్కొంది. క్లర్క్లుగా పాఠశాల సబ్జెక్టు టీచర్లను నియమించరాదు. తప్పనిసరిగా జూనియర్ అసిస్టెంట్లను మాత్రమే నియమించుకోవాలి. హాల్టికెట్ నంబర్లను ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలపై తప్పనిసరిగా విద్యార్థులతో రాయించాలని ఆదేశించింది. ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది పరీక్షాకేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండరాదు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం క్లోక్ రూమ్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలను అతిక్రమించి అక్రమాలకు పాల్పడితే సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని విద్యాశాఖ హెచ్చరించింది.
ప్రశ్నపత్రం ఎక్కడైనా లీకైతే ఏ పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చిందో వెంటనే గుర్తించేందుకు గత రెండేళ్ల నుంచి క్వశ్చన్ పేపర్లపై క్యూఆర్ కోడ్ను ప్రింట్ చేస్తున్నారు. అయినప్పటికీ పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏమాత్రం వెనకాడలేదు. ఇష్టారాజ్యంగా ఫొటోలను తీసి వాట్సప్ ద్వారా బయటకు పంపుతున్నారు. వాటికి జవాబులు రాసి విద్యార్థులకు ఇవ్వాలని ప్రైవేట్ పాఠశాలలు ఎత్తులు వేస్తున్నాయి. 2023 ఏప్రిల్ నెలలో జరిగిన టెన్త్ పరీక్షల్లోనూ వికారాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు వాట్సప్ ద్వారా బయటకు రావడం గమనార్హం. అప్పట్లో ఇన్విజిలేటర్లు, సిబ్బందిని తనిఖీ చేసిన అనంతరమే లోపలికి పంపాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ లీకేజీలకు అడ్డుకట్టపడలేదు. ఈసారైనా ఆగుతాయో లేదో చూడాలి..!
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
