Hyderabad: ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో ఫినో బ్యాంక్ MDకి దక్కని ఊరట!
హైదరాబాద్లో సంచలనం రేపిన ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి నంద్ కిశోర్ గుప్తా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. తన అరెస్టు చట్టవిరుద్ధమని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించినప్పటికీ, హైకోర్టు ఆయన వాదనలను అంగీకరించలేదు.

ముంబైకి చెందిన గుప్తా, ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డైరెక్టర్ జన్రల్ ఆఫ్ జీఎస్టీ ఇంటలీజెన్స్( Directorate General of GST Intelligence) అధికారులు తనపై తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమని, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21, 22లను ఉల్లంఘిస్తున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా, తన రిమాండ్ ఆర్డర్ను రద్దు చేయాలని కూడా అభ్యర్థించారు.
అయితే తన అరెస్టు అక్రమమని గుప్తా వాదించినప్పటికీ, కోర్టు దీనిపై సానుకూలంగా స్పందించలేదు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయడం సరికాదని అభిప్రాయపడింది. దీంతో గుప్తాకు తాత్కాలికంగా ఉపశమనం లభించలేదు. మొత్తానికి, ఆన్లైన్ బెట్టింగ్ కేసులో హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం కీలక మలుపుగా మారింది. ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశముండగా, ఇందులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే ఈ కేసులో గత ఫిబ్రవరి 18న హైదరాబాద్ యూనిట్కు చెందిన DGGI అధికారులు ముంబైలో అతడిని అరెస్టు చేశారు. భారీ స్థాయిలో జరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ చట్టాల కింద సెక్షన్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో, ఈ వ్యవహారం పెద్ద ఎత్తున ఆన్లైన్ బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించినదిగా అధికారులు అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయల అక్రమ ట్రాన్సాక్షన్లు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
