Hyderabad: పైకి బర్త్డే పార్టీ కలరింగ్.. లోపలికెళితే మైండ్ బ్లాంక్ సీన్లు.. ఏకంగా 33 మంది విద్యార్థులు..
హైదరాబాద్లో రేవ్ పార్టీ వ్యవహారం రచ్చ రేపుతోంది. హయత్ నగర్ శివార్లలో పసుమాములలో బర్త్డే పార్టీ ముసుగులో గంజాయితో ఎంజాయ్ చేస్తూ 33 మంది పట్టుబడ్డారు.
హైదరాబాద్లో రేవ్ పార్టీ వ్యవహారం రచ్చ రేపుతోంది. హయత్నగర్ శివార్లలో పసుమాములలో బర్త్డే పార్టీ ముసుగులో గంజాయితో ఎంజాయ్ చేస్తూ 33 మంది పట్టుబడ్డారు. వీరిలో నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు. వచ్చేది న్యూ ఇయర్ కావడంతో ఇప్పటికే పార్టీల విషయంలో స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు తాజా ఘటనతో మరింత అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో సుభాష్ అనే యువకుడి పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి మత్తు గుప్పుమంది. పసుమామలలోని ఓ గెస్ట్ హౌజ్లో జరిగిన రేవ్పార్టీలో 33 మంది యువతీయువకులు గంజాయి సేవించి డీజేలతో నానా హంగామా చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దాడిచేయడంతో వారి గంజాయి గలాటా బట్టబయలైంది. వీళ్లంతా ఎంజీఐటీ, సీబీఐటీ వంటి పేరున్న కాలేజీల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులే. బర్త్ డే పార్టీ పేరుతో పక్కదారి పట్టారు. గంజా తాగుతూ అర్థరాత్రి రచ్చ రచ్చ చేశారు. పోలీసుల దాడిలో స్పాట్లోనే 50 గ్రాముల గంజాయి పట్టుబడింది. రోహిత్ అనే వ్యక్తి వీరికి గంజాయి సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. హయత్ నగర్లోని ఆటోనగర్ ప్రాంతంలోని ఓ వ్యక్తి నుంచి గంజాయి తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ రేవ్ పార్టీలో మత్తులో జోగిన 33 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు. వీరిలో నలుగురు యువతులున్నారు. వీరిలో కొందరిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతే కాదు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.
అలర్ట్ అయిన పోలీసులు..
న్యూఇయర్కి ముందే నగరంలో గుప్పుమంటోన్న గంజాయి మత్తు ఆందోళనకరంగా మారింది. మత్తులో తేలుతున్న వారంతా ఉన్నత చదువులు చదువుతోన్న విద్యార్థులు కావడం కలవరానికి గురిచేస్తోంది. తమ పిల్లల తీరుపై తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ రేవ్ పార్టీ పక్కా ప్రణాళికతో.. ప్రీప్లాన్డ్గా జరిగినట్టు వెల్లడించారు పోలీసులు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై మరింత నిఘా పెడతామని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..