Negligence: హృదయవిదారక ఘటన.. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట.. రోగుల మధ్యలోనే మహిళ మృతదేహం..!?
సర్కారు దవాఖానాల్లో నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఏ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో.. ఎవరి కండీషన్ ఎలా ఉందో పట్టించుకునే నాథుడే కనిపించని దిక్కుమాలిన పరిస్థితి.
Woman dead body among all the patient in Mahabubabad Hospital: సర్కారు దవాఖానాల్లో నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఏ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో.. ఎవరి కండీషన్ ఎలా ఉందో పట్టించుకునే నాథుడే కనిపించని దిక్కుమాలిన పరిస్థితి. ఆఖరికి బెడ్ మీద ప్రాణాలు విడిచినా పట్టించుకున్న పాపాన పోలేదు. మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో సరిగ్గా ఇదే జరిగింది. రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షురాలు డాక్టర్ సైరాభాను ఆకస్మిక తనిఖీలోనే ఈ ఘటన సాక్షాత్కరించింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో సడెన్ చెకింగ్కు వెళ్లారు సైరాభాను. అక్కడ పరిస్థితి కళ్లారచూసి అవాక్కయ్యారు. ఏ వార్డు చూసినా అపరిశుభ్ర వాతావరణమే. వార్డులను సందర్శిస్తూ పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ వార్డులో రోగులందరి మధ్య ఓ మహిళ చనిపోయి కనబడింది. ఈ ఘటన అక్కడున్న వాళ్లందర్ని కలచివేసింది. కానీ సిబ్బంది మాత్రం తమకేం పట్టనట్టే ఉన్నారు.
ఘటనపై సైరాభాను ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిబ్బంది కదిలారు. మృతదేహాన్ని ప్యాక్ చేసి మార్చురీకి తరలించారు. కానీ మార్చురీలో దుర్గంధ భరితమైన వాసన. ఇదేంటని అడిగితే ఫ్రీజర్లు పనిచేయడం లేదనే సమాధానం వచ్చింది. వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.
సర్కారు దవాఖానా అంటేనే భయపడే పరిస్థితి. ఇక ఇలాంటి ఘటనలు కళ్లముందు కనిపిస్తే పరిస్థితేంటి. రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షురాలు వస్తేనే సిబ్బంది అంతంతమాత్రంగా స్పందించారు. ఇక సామాన్యుడ్ని ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పేషెంట్ల బంధువులు.