Telangana: పెళ్లింట విషాదం.. పెళ్లైన 24 గంటల్లోనే వరుడు మృతి.. పాపం వధువు..
ఎన్నో కలలతో వైవాహిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ పెళ్ళికొడుకుని విధి వెంటాడింది.. కాళ్లకు పెట్టిన పెళ్లి పారాణి ఆరకముందే, ఇంటి ముందు గుమ్మానికి కట్టిన తోరణాలు వాడక ముందే, పెళ్లి కొడుకుని మృత్యువు కబలించింది.. పెళ్లి అయి కనీసం 24 గంటలు గడవకముందే ఆ పెళ్లి కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు..

మెదక్, సెప్టెంబర్ 04: ఎన్నో కలలతో వైవాహిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ పెళ్ళికొడుకుని విధి వెంటాడింది.. కాళ్లకు పెట్టిన పెళ్లి పారాణి ఆరకముందే, ఇంటి ముందు గుమ్మానికి కట్టిన తోరణాలు వాడక ముందే, పెళ్లి కొడుకుని మృత్యువు కబలించింది.. పెళ్లి అయి కనీసం 24 గంటలు గడవకముందే ఆ పెళ్లి కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం, ప్రస్తుతం దుఃఖ సంద్రంలో మునిగిపోయింది.. తన భవిష్యత్తు ఏమిటో తెలియక ఆ పెళ్లికూతురు అయోమయ స్థితిలో ఆవేదన చెందుతుంది..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ కి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం కుదిరింది. నిరంజన్ సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అందరిలాగే తను కూడా దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి ఓ మంచి ముహూర్తం చూసుకున్నాడు. శనివారం రోజున తన కుటుంబ సభ్యులు, స్నేహితులు బంధువర్గం సమక్షంలో పండగ వాతావరణంలో పెళ్లి చేసుకున్నాడు. తన మంచి భవిష్యత్తు, దాంపత్య జీవితం కోసం ఎన్నో కలలు కన్నాడు.. కానీ ఆ కలలు అన్ని ఒకేసారి కన్నీరుగా మారి ఆవిరైపోయాయి.
పెళ్లి తర్వాత సోమవారం రోజు రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నాడు నిరంజన్.. దానికి సంబంధించిన కార్యక్రమాలను తానే సొంతంగా చూసుకునే బాధ్యత తీసుకున్నాడు. అందులో భాగంగానే మేడ పైకి వెళ్లి కార్యక్రమాలకు సంబంధించి పనులు చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఇంటికి అలంకరించిన డెకరేషన్ లైటింగ్ వైర్లను సరి చేస్తూ ఉండగా.. విద్యుత్ షాక్ తగిలింది. దీంతో నిరంజన్ కింద పడిపోయాడు. నిరంజన్ కు గాయాలయ్యాయి.




అయితే, కిందపడిపోయిన నిరంజన్ ను గమనించిన కుటుంబీకులు హుటాహుటిన ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో నిరంజన్ కుటుంబ సభ్యులు, పెళ్లికూతురు బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. పెళ్లి జరిగి 24 గంటలు కూడా గడవక ముందే భర్త చనిపోవడంతో ఆ పెళ్లికూతురు బాధ వర్ణనానీతతం..పెళ్లికూతురు కుటుంబ సభ్యులు అయోమయంలో పడి పోయారు.. పెళ్లి ఇంట మరణం సంభవించడం ఆ ఊరి ప్రజలందరినీ కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
