Ganesh Immersion: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..

Ganesh immersion in Hussain Sagar: హైదరాబాద్‌లోని హుస్సేన్​సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై నేడు అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. దీనిపై హైకోర్టు

Ganesh Immersion: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..
Supreme Court Ganesha
Follow us

|

Updated on: Sep 16, 2021 | 4:37 AM

Ganesh immersion in Hussain Sagar: హైదరాబాద్‌లోని హుస్సేన్​సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై నేడు అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. దీనిపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం విచారించేందుకు అంగీకరించింది. హుస్సేన్ సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ తీర్పును సవాల్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. సుప్రీం కోర్టులో నిమజ్జనంపై ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా వస్తుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకుంటే నిమజ్జనం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాద్ గ్రేటర్​లో నిర్మించిన 25 నీటి కొలనులకు కూడా జీహెచ్ఎంసీ మరమ్మతులు పూర్తి చేసి నిమజ్జనానికి సిద్ధం చేస్తోంది.

హైకోర్టు తీర్పు అనంతరం.. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి మినహాయింపుని ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ అభ్యర్థించింది. ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్‌ను పరిశీలించిన చీఫ్ జస్టిస్ట్ ఎన్వీ రమణతో కూడిన బెంచ్.. గురువారం నాడు విచారిస్తామని స్పష్టం చేసింది.

హుస్సేన్‌సాగర్‌తో పాటు చెరువుల్లో పర్యావరణహితమైన విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని, జీహెచ్ఎంసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హుస్సేన్ సాగర్‌లో పర్యావరణానికి హానీ కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ కలిగిన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ ఆదేశించింది. అయితే, నిమజ్జనం సమయం సమీపిస్తున్న తరుణంలో హైకోర్టు ఇలా తీర్పునివ్వడంతో ప్రభుత్వం, జీహెచ్ఎంసీకి ఎదురుదెబ్బ తగిలనట్లయింది.

ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతివ్వాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రివ్యూ పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టేసింది. తీర్పుపై ఆలోచించేది లేదని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనంటూ స్పష్టంచేసింది. తమ ఆదేశాలను పాటించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.

Also Read:

Sansad TV: సంసద్ టీవీని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇకపై రెండు ఛానెళ్లు కలిపి ఒకటిగా..

సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.. కేంద్ర మంత్రులకు చిన్నజీయర్ స్వామి ఆహ్వానం..