Free Dialysis: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది.
Free Dialysis for Kidney patients in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ అమలు తీరుపై మంత్రి హరీశ్ వైద్య, ఆరోగ్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు ప్రాంతాల్లో తక్షణమే డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్తో పాటు వరంగల్లో ఏర్పాటు చేయనున్న కేంద్రాల ద్వారా ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఐదు బెడ్ల చొప్పున కేటాయించి డయాలసిస్ సేవలను అందించాలని సూచించారు. తక్షణమే ఈ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. డయాలసిస్ చేయించుకోవడం కిడ్నీ రోగులకు ఆర్థికంగా చాలా భారంగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
ప్రస్తుతం కిడ్నీ బాధితులకు ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా 10 వేల మంది రోగులకు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. డయాలసిస్ సెంటర్ల నిర్వహణకు ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కిడ్నీ రోగుల సంఖ్యకు తగినట్టుగా డయాలసిస్ మెషీన్లను ఏర్పాటు చేసి, వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామని గుర్తు చేశారు. ఇకముందు నుండి ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు డయాలసిస్ కేంద్రాలను యుద్దప్రాతిపదిన ఏర్పాటు చేయలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు.