Telangana Election: బీఆర్ఎస్లోకి కాసాని.. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్లకే.. సీఎం కేసీఆర్ హామీ
వచ్చే ఎన్నికల్లో 112 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలవాల్సిందే అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 7స్థానాలు తమవి కాదని చెప్పారు. తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాసానికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్.

వచ్చే ఎన్నికల్లో 112 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలవాల్సిందే అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 7స్థానాలు తమవి కాదని చెప్పారు. తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాసానికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. భవిష్యత్లో చాలా అవకాశాలు ఉంటాయని ముదిరాజ్ లీడర్లను తయారు చేసుకుని అందరికీ పదవులు ఇస్తామన్నారు కేసీఆర్.
ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారని, ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు కేసీఆర్. గజ్వేల్ నియోజక వర్గంలోని ఎర్రవల్లి కేసీఆర్ ఫాంహౌస్లో టీడీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల తరువాత ముదిరాజ్లతో ప్రత్యేక సమావేశం అవుతనని చెప్పారు. వృత్తి పరంగా తెలంగాణలో ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు కేసీఆర్. గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ముదిరాజ్ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని, ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, జడ్పి, మున్సిపల్ చైర్మన్, స్థానిక సంస్థల పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈటెల ఎవరిని ఎదగనివ్వలేదు, బండ ప్రకాష్ ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు కేసీఆర్. ఎన్నికల తరువాత ఎంతో అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో.. ముదిరాజ్ల సమస్యల పరిష్కారంపై తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ ఏడాది కిందటే బీఆర్ఎస్ లోకి రావాల్సి ఉండే, ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞులైన ఆయన రావడం మాకు శుభపరిణామం అన్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు బీఆర్ఎస్లో చేరిన టీడీపీ నాయకులు
కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముప్పిడి గోపాల్, కార్యనిర్వహాక కార్యదర్శులు ప్రకాష్ ముదిరాజ్, భిక్షపతి ముదిరాజ్, పుట్టి రాజు ముదిరాజ్, జగదీష్ యాదవ్, కార్యదర్శి మన్నే రాజు, సపన్ దేవ్ ముదిరాజ్, టీడీపీ మహేశ్వరం ఇంచార్జ్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ కనకయ్య ముదిరాజ్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ కరాటే రాజు ముదిరాజ్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు చంద్రహాస్, నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యదర్శి దూసరి వెంకటేష్ తదితరులు బీఆర్ఎస్ లో చేరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..