ఇలా అయితే ఎలా.! ఇది చూశాక బయట తినాలంటేనే భయమేస్తోందిగా..!
హైదరాబాద్ మహానగరంలో ఆహార కల్తీ దందా భయంకర స్థాయికి చేరుకుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 61 కల్తీ కేసులు నమోదవడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు నిత్యం వినియోగించే బిస్కెట్లు, ఐస్క్రీమ్స్ నుంచి వంటింట్లో వాడే అల్లం-వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, పాలు, పెరుగు వరకు అనేక ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

హైదరాబాద్ మహానగరంలో ఆహార కల్తీ దందా భయంకర స్థాయికి చేరుకుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 61 కల్తీ కేసులు నమోదవడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు నిత్యం వినియోగించే బిస్కెట్లు, ఐస్క్రీమ్స్ నుంచి వంటింట్లో వాడే అల్లం-వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, పాలు, పెరుగు వరకు అనేక ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా విషపూరిత పదార్థాలను ఆహారంలో కలపడం ప్రమాదకర పరిణామంగా మారింది. ప్రజారోగ్య పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతపై కఠిన చర్యలకు దిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే H-FAST బృందం ఏర్పాటై కల్తీ దందాపై ఉక్కుపాదం మోపుతోంది.
H-FAST బృందం ఇటీవల కల్తీ దందా తాట తీస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ కల్తీ ముఠాల గుట్టును రట్టు చేస్తోంది. గత నెల రోజుల వ్యవధిలోనే అధికారులు 61 కేసులు నమోదు చేసి, సుమారు 15 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో పాల్గొన్న 64 మంది నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా అధికారులు కఠిన సందేశం పంపించారు. కల్తీ పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు మరింత విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.
ఇక తాజాగా హైదరాబాద్లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. కాటేదాన్లోని SKR ఫుడ్ ప్రొడక్ట్స్పై పోలీసుల దాడి చేసి, 4,032 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 6,210 కిలోల నాసిరకం అల్లం-వెల్లుల్లి నిల్వలను టాస్క్పోర్స్ పోలీసులు గుర్తించారు. ఇంందుకు సంబంధించి అక్రమ దందా నిర్వహిస్తున్న SKR ఫుడ్ ప్రొడక్ట్స్ యజమాని హసన్ అలీ రూపాణిపై కేసు నమోదు చేశారు. అత్యంత అపరిశుభ్రంగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తూ.. ప్లాస్టిక్ డబ్బాల్లో దుమ్మూ ధూళీ, ఈగల మధ్య నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత ప్రమాదకర అసిటిక్ యాసిడ్తో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారుచేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు నిర్వాహకులు. హోటల్స్, కిరాణా షాపులు, క్యాటరింగ్కు సరఫరా చేస్తున్నారు. మొత్తం 22 లక్షల రూపాయల విలువైన అల్లం-వెల్లుల్లి పేస్ట్.. సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు.
మరోవైపు, మెహిదీపట్నంలో కెమికల్ ఐస్క్రీమ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మెహిదీపట్నంలోని అలియా ఐస్క్రీమ్ పార్లర్పై టాస్క్ఫోర్స్ బృందం దాడి చేసింది. తనిఖీల్లో కెమికల్స్తో ఐస్ కాండీ, లస్సీ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. రూ.5లక్షల విలువైన ఐస్క్రీమ్స్, సామగ్రి స్వాధీనం చేసుకున్న పోలీసులు, అలియా ఐస్క్రీమ్ పార్లర్ నిర్వాహకుడు ముష్రఫుద్దీన్ అరెస్ట్ చేశారు.
లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కల్తీ లేని సమాజం, సురక్షితమైన ఆహారం లక్ష్యంగా చర్యలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద ఆహార పదార్థాలపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
