ఇతను మాజీ ఆర్మీ జవాన్.. తాగుడుకు అలవాటు పడి ఎలా తయారయ్యాడో చూడండి..
దేశాన్ని కాపాడాల్సిన మాజీ సైనికుడే విలాసాల కోసం నేరబాట పట్టాడు. మహిళలు, పిల్లలను కట్టేసి దోపిడీ చేసిన గ్యాంగ్ను సిద్దిపేట పోలీసులు కేవలం మూడు రోజుల్లో అరెస్ట్ చేసి షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ..

దేశ రక్షణలో సేవలందించిన ఒక మాజీ సైనికుడు.. విలాసాలకు బానిసై నేరబాట పట్టడం అధికారులను సైతం షాక్కు గురిచేసింది. కత్తులతో బెదిరిస్తూ, మహిళలు–పిల్లలను బంధించి దోపిడీలు చేస్తున్న గ్యాంగ్ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట రూరల్ పరిధిలోని బురుగుపల్లిలో ఈ నెల 4వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఘోర ఘటన జరిగింది. ఒక డాక్టర్ ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో బెదిరించి భీభత్సం సృష్టించారు. ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులను ఛార్జింగ్ కేబుల్స్, టవల్స్తో కట్టేసి నోరు నొక్కేసి… నగదు, బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు.
ఈ కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన నరేంద్రుల శ్రీకాంత్ అలియాస్ క్రాంతి (41) ఈ దోపిడీకి సూత్రధారిగా తేలాడు. మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన ఇతను ప్రస్తుతం రామగుండం Indian Oil Corporation (IOC)లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. విలాసవంతమైన జీవనశైలికి జీతం సరిపోకపోవడంతో.. పాత నేరస్తులు, స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్తో దోపిడీకి స్కెచ్ వేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక ఆధారాలతో కేవలం మూడు రోజుల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి సుమారు 4.5 తులాల బంగారం, ఒక కారు, ఒక బైక్, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
