కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో షాకింగ్ ఘటన జరిగింది. కూతురిని వేధిస్తున్న యువకుడిని మందలించినందుకు ఓ తండ్రిపై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా బ్లాక్మెయిలింగ్, పాత ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కూతురిని వెంటపడుతూ వేధిస్తున్న యువకుడిని మందలించినందుకు ఆగ్రహం పెంచుకున్న ఓ యువకుడు.. ఆమె తండ్రిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
దుమ్ముగూడెం మండలంలో సెర్ప్లో సీసీగా పనిచేస్తున్న గౌరవరపు నరసింహారావు కుమార్తెను ఉప్పాడ హర్షిత్రెడ్డి అనే యువకుడు కొంతకాలంగా వెంటపడుతూ వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యువతి ఫొటోతో పాటు ఆమెతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడని నరసింహారావు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై గతంలో దుమ్ముగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకుడిని పిలిపించి హెచ్చరించి వదిలేశారని బాధితుడి తండ్రి పేర్కొన్నట్లు సమాచారం. అయితే యువకుడిని మందలించిన విషయాన్ని మనసులో పెట్టుకున్న హర్షిత్రెడ్డి.. నరసింహారావుపై పగ పెంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నరసింహారావుపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దాడిలో ఆయన ఎడమ భుజానికి లోతైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. రక్తస్రావంతో కొద్దిసేపు స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వీడియో చూడండి
వెంటనే కుటుంబ సభ్యులు బాధితుడిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కత్తి దాడి కారణంగా లోతైన గాయాలు కావడంతో కుట్లు వేసి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దాడి అనంతరం హర్షిత్రెడ్డి సోషల్ మీడియాలో ఓ హెచ్చరిక ధోరణిలో పోస్టు చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. ఘటనపై దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. యువతిని వేధించినట్లు వచ్చిన ఆరోపణలు, గతంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, కత్తి దాడికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
