AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే

సాధారణంగా ఆదివారం హాలిడే అనగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. స్వగ్రామానికి వెళ్లడం.. బంధువులను కలుసుకోవడం వంటి కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటారు. అలానే ఓ జంట కూడా సంతోషంగా బంధువుల ఇంటికి బైక్‌పై బయల్దేరారు. ఫోన్ రావడంతో రోడ్డు పక్కన ఆగారు. అంతలోనే వారి సంతోషం ఆవిరైంది. ఇంతకు దీంతో ఆ దంపతులకు ఏమైంది.?

Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
Yadadri News
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 03, 2025 | 11:14 AM

Share

యాదాద్రి జిల్లా రాజపేట మండల కేంద్రానికి చెందిన గర్దాసు ప్రశాంత్ (32), భార్య ప్రసూన(28) దంపతులు మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బోడ్డుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఉన్న బంధువుల ఇంటికి సంతోషంగా బైక్‌పై బయల్దేరారు. బీబీనగర్‌ పెద్దచెరువు సమీపంలోకి రాగానే ప్రశాంత్‌కు ఫోన్‌ రావడంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు కారులో వెళ్తున్న ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న దంపతులపైకి దూసుకెళ్లింది. దీంతో ప్రశాంత్ అక్కడికక్కడే చనిపోగా, ప్రమాదం ధాటికి ప్రసూన బీబీనగర్ చెరువు అడుగులో ఎగిరి పడి మృతి చెందింది.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన తంగెళ్లపల్లి షణ్ముక్‌, చైతన్యపురికి చెందిన భార్గవ్‌, వరంగల్‌ పద్మానగర్‌కు చెందిన సాయిరిత్‌ హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకోవాలని భావించారు. ఇందుకోసం ఎల్బీనగర్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకొని బయలుదేరారు. బీబీనగర్ చెరువు సమీపంలోకి రాగానే వీరి వాహనం అతివేగంగా.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతున్న దంపతులను బలంగా ఢీకొట్టింది. దీంతో దంపతులు మృతి చెందడంతో పాటు కారు నడుపుతున్న షణ్ముక్‌ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో ఉన్న భార్గవ్‌, సాయిరిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షణ్ముఖ, సాయిరిత్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బీబీనగర్ పోలీసులు చెబుతున్నారు. నిర్లక్షపు డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.