CM Revanth Reddy: తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు సహకరించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి!
తెలంగాణలో క్రీడాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సహకరించాలని కోరారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చేందుకు అవకాశం కల్పించాలని కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు.

ఖేలో ఇండియాతో పాటు ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ క్రీడలను తెలంగాణలో నిర్వహించేందుకు అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రీడలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వసతుల మెరుగుకు అన్నివిధాలా కృషి చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలని సీఎం కోరారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, క్రీడా నిపుణుల ఎంపిక, ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు.
భువనగిరిలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మల్టీపర్పస్ హాల్, హైదరాబాద్ హకీంపేట్ లో అర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, ఎల్.బి.స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేచురల్ ఫుట్బాల్ ఫీల్డ్ అభివృద్ది, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్ నవీకరణ, నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాలకు రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అలాగే 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్లో కనీసం రెండు ఈవెంట్లు తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణాల్లో ఛార్జీ రాయితీ ఇవ్వాలని సీఎం కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
