AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణలో వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Telangana: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
CM Revanth Reddy
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 21, 2025 | 6:58 PM

Share

వర్షాలపై అప్రమత్తంగా ఉండండి

జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 21 శాతం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో ప్రత్యేక బృందాలు

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా 150 బృందాలను ఏర్పాటు చేసినట్టు సీఎం వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ సమన్వయంతో టీంలను ముందుగానే పంపిస్తున్నట్టు తెలిపారు. పోలీస్ కమిషనరేట్లకు చెందిన ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యక్షంగా గ్రౌండ్‌లో ఉండాలని స్పష్టం చేశారు.

గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు

పిడుగుపాటుతో జరిగే నష్టాలను నమోదు చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి

కలెక్టర్లు ఖచ్చితంగా రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. “అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు” అని హెచ్చరించారు. కలెక్టర్ల కార్యాచరణపై ప్రతిరోజూ ప్రభుత్వానికి పూర్తి రిపోర్టు అందించాలన్న ఆదేశాలను సీఎస్‌కు జారీ చేశారు.

వరి ధాన్యం, నీటి మేనేజ్మెంట్‌పై దృష్టి-

వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి యాజమాన్యం (వాటర్ మేనేజ్మెంట్) పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. “ఈ ఖరీఫ్‌ లో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ వన్‌ గా నిలిచాం,” అని సీఎం తెలిపారు.

ఎరువుల స్టాక్‌పై స్పష్టత – కఠిన చర్యల హెచ్చరిక

ఎరువుల కొరతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించిన సీఎం, ప్రతి ఎరువుల షాప్ వద్ద స్టాక్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. స్టాక్ వివరాలు ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. యూరియాను ఇతర వ్యాపార అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రైతుల కోసం ప్రత్యేక ఫిర్యాదు డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.

రేషన్ కార్డులపై కీలక ఆదేశాలు-

రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని సీఎం తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ప్రజల ఆసక్తి తక్కువగా ఉండేదని, ఇప్పుడు సన్న బియ్యం వల్ల రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని వివరించారు. రేషన్ కార్డు, రేషన్ షాపుల విలువ పెరిగిందని తెలిపారు.

రేషన్ కార్డుల పంపిణీ – కలెక్టర్ల సమన్వయం కీలకం

ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జి మంత్రులు తప్పకుండా పాల్గొనాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు సమన్వయం చేయాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..