6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం.. అధికార పార్టీని ఇరుకుపెట్టేలా ప్లాన్
గ్యారంటీ హామీల అమలుపై అసెంబ్లీలో మరోసారి రాజకీయ రచ్చ జరగనుందా ? అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు వారి హామీలనే అస్త్రాలుగా చేసుకోవాలని విపక్షాలు భావిస్తున్నాయా ? ప్రతిపక్షాల రాజకీయ వ్యూహాలకు కాంగ్రెస్ ఏ రకమైన కౌంటర్ను సిద్ధం చేసింది. ఆ వివరాలు

కాంగ్రెస్ గ్యారంటీ హామీల అమలుపై విపక్షాలు రాజకీయ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికీ గ్యారంటీ హామీల్లో పలు హామీలు అమలు కావడం లేదని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ.. బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ అంశంపై అధికార పార్టీని ఇరుకుపెట్టేందుకు ప్రత్యేకమైన కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ఉభయసభల్లో పెట్టడానికి బీఆర్ఎస్ రెడీ అయ్యింది. దీనికి సభ్యులందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే ప్రైవేటు బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుపై కమలం పార్టీ కూడా పట్టుపడుతోంది. అందులో భాగంగా రేపు చలో అసెంబ్లీ పేరిట పోరుబాటకు సిద్ధమవుతోంది. హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించడంపై అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. నేతలను విడుతల వారీగా అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చేలా ప్లాన్ చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుండటంతో.. ఈ రాజకీయ దాడిని ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
