Tiger Fear: తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న పులి.. చిక్కనంటే చిక్కనంటున్న ‘బెంగాల్ టైగర్’..
Tiger Fear: పులి.. పులి.. ఇదేం నినాదం కాదు! జనానికి పట్టి పీడిస్తున్న భయం. ఇక్కడా అక్కడా అని కాదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పులుల సంచారం..
Tiger Fear: పులి.. పులి.. ఇదేం నినాదం కాదు! జనానికి పట్టి పీడిస్తున్న భయం. ఇక్కడా అక్కడా అని కాదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పులుల సంచారం జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని జిల్లాల్లో ఫారెస్ట్ అధికారులు స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టినా చిక్కడం లేదు. మరి కొన్ని చోట్లా అధికారులు అందుబాటులో లేక రైతులు, స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పులులు ఎప్పుడు ఎలా దాడిచేస్తాయో తెలియక బిక్కిబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు.
ఉత్తరాంధ్రలో ముప్పుతిప్పలు పెట్టిన పులికోసం వేట కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాలో రెండు నెలలుగా మకాం వేసిన పులికోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. నాలుగున్నరేళ్ల వయసున్న బెంగాల్ టైగర్ను ట్రాప్ చేసేందుకు శ్రమిస్తున్నారు. అనకాపల్లిలో సంచరిస్తున్న ఈ బెంగాల్ టైగర్ స్టోరీ సీరియల్ లాగా నడుస్తోంది. చిక్కదు దొరకదు అన్నట్టుగా.. చిక్కినట్టే చిక్కి ఎస్కేప్ అవుతోంది. అధికారులకే ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రత్యేక రెస్య్కూ ఆపరేషన్ మొదలు పెట్టినా.. ప్రత్యేక బోన్ తీసుకొచ్చి పెట్టినా చిక్కడం లేదు.
అయితే తాజాగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిపిరి వలస వైపు టైగర్ వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా అక్కడ పులి పాదముద్రలు కనిపించాయి. పదిరోజుల కిందట చిపిరి వలస వెళ్లి అక్కడి నుంచి తిరిగి చంద్రయ్యపేటకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ తిరిగి చిపిరివలస వెళ్లడంతో ఈ రెండు రోజుల్లో తిరిగి చంద్రయ్యపేటకు వస్తుందనేది అటవీశాఖ అధికారుల అంచనా.
అటు.. తెలంగాణలోని నల్గొండ, మంచిర్యాలలో కూడా పులుల సంచారం జనంలో భయం పుట్టిస్తోంది. గుట్టల్లో సంచరిస్తున్న పులులు.. పశువులపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో పదుల సంఖ్యలో పశువులను, గొర్రెలను చంపేశాయి. అధికారులకు సమాచారం అందించినా వీటిని బంధించేందుకు చర్యలు చేపట్టడంలో కొంత ఆలస్యం జరుగుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పులిసంచారం స్థానికులను భయపెడుతోంది. ఎదులబందం గ్రామంలో పులిదాడిలో ఆవు, లేగదూడ ప్రాణాలు కోల్పాయాయి. పగ్ మార్క్స్ ఆధారంగా పశువులను పులే దాడిచేసి చంపినట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు. వారం రోజులుగా కోటపల్లి రేంజ్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో ఆరుగ్రామాల ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసిన అధికారులు.. పులిజాడ కోసం చర్యలు ముమ్మరం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..