Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ బ్యాంక్ అధికారులుగా నటించి ఇంట్లోని సొమ్మును చోరీ చేశారు దుండగులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేగుతోంది. వృద్దుడి మోసపోగా.. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్యాంక్ అకౌంట్ పేరుతో ఆధార్, అడ్రస్ కావాలంటూ రకరకాల కారణాలు చెప్పి ఇంట్లోకి వచ్చి దోపిడీలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఇలాంటి వారిని నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయినా ఏదో ఒక చోట కొందరు అమాయకంగా నమ్మి డబ్బులు ,నగలు పోగొట్టుకొంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇలాంటి తరహా ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఆధార్ కార్డు అప్ డేట్ చేయడానికి వచ్చానని చెప్పి ఇంట్లోని వెండి ఆభరణాలను దొంగలించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో ఓ వృద్ధుడిని మాటల్లో దించి మత్తుమందు చల్లి ఇంట్లో నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంభయ్య పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ఆయన ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తాను బ్యాంకు నుంచి వచ్చినట్లు అతడితో పరిచయం చేసుకున్నాడు. ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పడంతో శంబయ్య ఆ ప్రయత్నంలో ఉండగా.. అతనిపై మత్తు మందును చల్లి ఐదు వేల నగదుతో పాటు 15 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు దుండగుడు. జరిగిన దొంగతనంపై శంబయ్య కుటుంబ సభ్యులు కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
