ఓటు వేసేందుకు వెళ్లి.. బ్యాలెట్ పేపర్లను కసపస నమిలి మింగేసిన మందుబాబు!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో శాంతియుతంగా ఓటింగ్ జరుగుతుండగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో మాత్రం ఓ విచిత్ర ఘటన నమోదైంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వెంకట్ అనే ఓటరు

జగిత్యాల, డిసెంబర్ 11: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో శాంతియుతంగా ఓటింగ్ జరుగుతుండగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో మాత్రం ఓ విచిత్ర ఘటన నమోదైంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వెంకట్ అనే ఓటరు చేసిన పని గ్రామంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన వెంటనే వెంకట్ బ్యాలెట్ పేపర్ తీసుకుని ఓటు వేసి బాక్స్లో వేయాల్సిన వార్డు మెంబర్ బ్యాలెట్ను ఒక్కసారిగా నమిలి నేరుగా మింగేశాడు. అంతటితో ఆగకుండా సర్పంచ్ బ్యాలెట్ పేపర్ను కూడా నమిలి చెంతనే ఊయడంతో పోలింగ్ సిబ్బంది షాక్కు గురయ్యారు. అక్కడే ఉన్న ఇతర ఓటర్లు కూడా పరిస్థితిని అర్థం చేసుకోలేక ఆశ్చర్యపోయారు. పోలింగ్ ప్రక్రియను దెబ్బతీసే ఈ చర్యపై వెంటనే స్పందించిన పోలింగ్ అధికారులు వెంకట్ను అదుపులోకి తీసుకొని బయటకు తరలించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని వెంకట్ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. బ్యాలెట్ పేపర్లను ధ్వంసం చేసినందుకు సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియ పవిత్రమైనదని, మద్యం మత్తులో అలాంటి అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. గ్రామంలో మాత్రం ఈ ఘటన పెద్ద చర్చకు దారి తీసింది. ‘ఎన్నికలంటే ఇంత నిర్లక్ష్యమా?’ ‘పోలింగ్ బూత్లో ఎవ్వరూ ఇలాంటివి ఊహించరే!’ అంటూ గ్రామస్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతి భద్రతల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
మరోచోట.. ఓటేసి ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ ముక్కలుగా చించేసిన ఓటర్!
రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ తండాలో మరో ఓటర్ హల్చల్ చేశాడు. పోలింగ్ స్టేషన్లో బ్యాలెట్ పేపర్ను ఓ వ్యక్తి చించేశాడు. పొరపాటున వేరే అభ్యర్థికి ఓటు వేయడంతో బ్యాలెట్ పేపర్ చించేశానని సత్యనారాయణ తెలిపాడు. దీంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




