PKL 2024: గుజరాత్ జెయింట్స్ శుభారంభం.. బెంగళూరుకు వరుసగా రెండో ఓటమి..
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. బెంగళూరు బుల్స్ వరుసగా రెండో మ్యాచ్లో ఓడిపోయింది. ఆదివారం (20 అక్టోబర్ 2024) రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ 36–32తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది.
హైదరాబాద్, అక్టోబర్20: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేయగా.. బెంగళూరు బుల్స్ వరుసగా రెండో మ్యాచ్లో ఓడిపోయింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ 36–32తో బెంగళూరుపై విజయం సాధించింది. గుజరాత్ తరఫున రైడర్ పర్దీక్ తహియా 8 పాయింట్లతో ఆకట్టుకోగా.. హిమాన్షు సింగ్ ఏడు, గుమన్ సింగ్, సోంబీర్ చెరో ఆరు పాయింట్లతో రాణించారు. బెంగళూరు కెప్టెన్ పర్దీప్ నర్వాల్ 9 రైడ్ పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతను 1700 రైడ్ పాయింట్ల మైలురాయి దాటాడు. ప్రొ కబడ్డీ లీగ్లో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. అతనితో పాటు అజింక్యా పన్వార్ (7) ఆకట్టుకున్న బుల్స్కు రెండో ఓటమి తప్పించలేకపోయారు.
కెప్టెన్ పర్దీప్ నర్వాల్ బోనస్తో ఖాతా తెరిచిన బెంగళూరు బుల్స్ తర్వాతి రైడ్లో అతను తెచ్చిన రెండు పాయింట్లతో 3–1తో నిలిచింది. ఆపై, గుజరాత్ ఆటగాడు పర్దీక్ దహియాను జై భగవాన్ టచ్ చేసి మరో పాయింట్ అందించాడు. భగవాన్ను సోంబీర్ ట్యాకిల్ చేయడంతో డిఫెన్స్లో తొలి పాయింట్ రాబట్టిన గుజరాత్ 4–4తో స్కోరు సమం చేసింది. పర్దీప్ నర్వాల్ను కూడా సోంబీర్ నిలువరించడంతో 7–4తో ఆధిక్యం సాధించింది. కానీ, అజింక్యా పన్వర్ వరుస రైడ్స్తో ఆకట్టుకోవడంతో గుజరాత్ను ఆలౌట్ చేసిన బెంగళూరు 13–9తో తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది. పర్దీప్ మళ్లీ జోరు పెంచడంతో 18–13తో ముందంజ వేసింది. జోరు మీదున్న అజింక్యా పన్వర్ను పర్దీక్ దహియా సూపర్ ట్యాకిల్ చేయగా.. తొలి అర్ధభాగాన్ని గుజరాత్ 16–19తో మూడు పాయింట్ల వెనుకంజతో ముగించింది.
విరామం తర్వాత గుజరాత్ మ్యాజిక్ చేసింది. పర్దీప్, అజింక్యా పన్వార్ను ట్యాకిల్ చేసింది. ఆ జట్టు రైడర్ హిమాన్షు సింగ్ వరుసగా ఐదు రైడ్లలో విజయవంతం అయ్యాడు. దాంతో బెంగళూరును ఆలౌట్ చేసిన జెయింట్స్ 25–23తో తిరిగి ఆధిక్యం సంపాదించుకుంది. బుల్స్ కెప్టెన్ పర్దీప్ మరోసారి ప్రత్యర్థి డిఫెండర్ల పట్టుకు చిక్కగా.. జై భగవాన్ను ట్యాకిల్ చేసిన సోంబీర్ హై ఫైవ్ పూర్తి చేసుకున్నాడు. అజింక్యా పన్వార్ను కూడా భగవాన్ కోర్టు బయటకు పంపించడంతో గుజరాత్ 33–28తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఆఖరి క్షణాల్లో స్కోరు సమం చేసేందుకు బెంగళూరు చెమటోడ్చింది. పర్దీప్, అజింక్యా చెరో టచ్ పాయింట్ తీసుకురాగా.. గుమన్ సింగ్ను నితిన్ రావల్ ట్యాకిల్ చేసినా ఆధిక్యాన్ని కాపాడుకున్న గుజరాత్ మ్యాచ్లో గెలిచింది. సోమవారం జరిగే మ్యాచ్లో యూపీ యోధాస్తో దబాంగ్ ఢిల్లీ కేసీ, పుణెరి పల్టాన్తో పట్నా పైరేట్స్ జట్లు తలపడతాయి.